‘అధిస్తాన్’కు ప్రభుత్వ సహకారం
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:14 AM
ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో గల ‘అధిస్తాన్’ (బ్రాండిక్స్) సంస్థ భారత్ భాగస్వామి దొరస్వామి తెలిపారు.

సీఎం భరోసా ఇచ్చారు: ‘బ్రాండిక్స్’ దొరస్వామి
అనకాపల్లి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో గల ‘అధిస్తాన్’ (బ్రాండిక్స్) సంస్థ భారత్ భాగస్వామి దొరస్వామి తెలిపారు. బుధవారం ఆయ న అమరావతిలో ముఖ్య మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రాండిక్స్ సంస్థ పేరు ‘అధిస్తాన్’ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్కుగా మార్పు, విస్తరణ, ఉపాధి పెంపు లక్ష్యాలను చంద్రబాబుకు వివరించారు.
అధిస్తాన్గా పేరు మార్పుతో వస్త్ర పరిశ్రమతో పాటు నూతనంగా ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఇండస్ట్రియల్ పార్కులో విస్తరించే అవకాశం ఉందని తెలిపారు. సంస్థలో ప్రస్తుతం 20 వేల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కృషిచేస్తున్నట్టు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం మాట్లాడుతూ మరొక 20 వేల మందికి ఉపాధి కల్పించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎటువంటి సహకారం అవసరమైనా అందిస్తామని భరోసా ఇచ్చారని దొరస్వామి బుధవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.