CM Chandrababu: 1.21 లక్షల కోట్ల పెట్టుబడులకు ఓకే
ABN , Publish Date - Mar 14 , 2025 | 04:04 AM
రాష్ట్రంలో రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన నాలుగవ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోద ముద్ర వేసింది.

నాలుగో ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదముద్ర
పది సంస్థల పెట్టుబడుల ద్వారా 80,104 మందికి ఉద్యోగాలు
ఇప్పటివరకు ఆమోదం పొందిన ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక ఎంఎ్సఎంఈ పార్కు
నెల రోజుల్లో రతన్టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
సంస్థలకు వేగంగా అనుమతివ్వాలి.. అధికారులకు సీఎం ఆదేశం
అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన నాలుగవ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోద ముద్ర వేసింది. ఈ పెట్టుబడుల ద్వారా 80,104 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. పరిశ్రమలు, విద్యుత్తు, పర్యాటకం వంటి రంగాల్లో మొత్తం పది సంస్థలు ఈ పెట్టుబడులు పెట్టనున్నాయి. రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సమీక్షించారు. అలాగే గడచిన మూడు ఎస్ఐపీబీ సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి పురోగతిని కూడా పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక ఎంఎ్సఎంఈ పార్కు చొప్పున మొత్తం 175 పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా తక్షణం 26 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున 26 ఎంఎ్సఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు చోట్ల ప్రతిపాదించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెలరోజుల్లోగా నెలకొల్పాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలు వెంటనే తమ కార్యకలాపాలను ప్రారంభించి, ఉత్పత్తి దశకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని, వాటిపై ఒత్తిడి పెంచాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన విషయంలో నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు మంత్రులు, అధికారులు మరింత వేగంగా పనిచేయాలని సూచించారు. అప్పుడే ప్రతి ఏడాది ప్రగతి ఫలితాలు కనిపిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటికే ఆమోదం తెలిపిన, ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతిపైనా సీఎం సమీక్షించారు. దీని కోసం ట్రాకర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. శాసనసభ ప్రాంగణంలోని ముఖ్యమంత్రి చాంబరులో గురువారం జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, లోకేశ్, టీజీ భరత్, బీసీ జనార్దనరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
4వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన పరిశ్రమలు
ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్: నాయుడుపేటలో రూ. 1,742 కోట్ల పెట్టుబడులతో 2,000 మందికి ఉద్యోగాలు.
దాల్మియా సిమెంట్: కడప జిల్లాలో రూ. 2,883 కోట్ల పెట్టుబడులు, 354 ఉద్యోగాలు.
లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం: రూ. 1,500 కోట్ల పెట్టుబడులు
సత్యవేడు రిజర్వ్ ఇన్ర్ఫాసిటీ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీసిటీ: రూ. 25,000 కోట్ల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాలు.
ఇండోసోల్ సోలార్ ప్రైవేటు లిమిటెడ్: రూ. 58,469 కోట్ల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాలు.
బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేటు లిమిటెడ్: రూ. 1,175 కోట్ల పెట్టుబడులు, 1,500 మందికి ఉద్యోగాలు.
ఏపీ ఎన్జీసీఎల్ హరిత్ అమ్రిత్ లిమిటెడ్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో: రూ. 22,000 కోట్ల పెట్టుబడులు, 8,300 మందికి ఉద్యోగాలు.
ఆస్తాగ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, అన్నమయ్య, కడప జిల్లాలు: రూ. 8,240 కోట్ల పెట్టుబడులు, 4,000 మందికి ఉద్యోగాలు.
మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్ కన్వెన్షన్: రూ. 400 కోట్ల పెట్టుబడులు, 750 మందికి ఉద్యోగాలు
ఒబెరాయ్ విలాస్ రిసార్ట్స్: రూ. 250 కోట్ల పెట్టుబడులు, 150 ఉద్యోగాలు.
గత మూడు సమావేశాల్లో ఆమోదం తెలిపిన పెట్టుబడులు
మొదటి ఎస్ఐపీబీ సమావేశంలో విద్యుత్తు రంగంలో రూ. 11,502 కోట్లు.. ఇతర రంగాల్లో రూ. 72,085 కోట్లు.. మొత్తం రూ. 83,987 కోట్ల పెట్టుబడులు. 29,585 మందికి ఉద్యోగాలు.
రెండవ ఎస్ఐపీబీ సమావేశంలో విద్యుత్తు రంగంలో రూ. 83,000 కోట్లు, ఇతర రంగాల్లో రూ. 99,162 కోట్లు.. మొత్తంగా రూ. 1,82,162 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 2,63,411 మందికి ఉద్యోగాలు దక్కుతాయి.
మూడవ ఎస్ఐపీబీ సమావేశంలో విద్యుత్తు రంగంలో రూ. 42,932 కోట్లు, ఇతర రంగాల్లో రూ. 1,844 కోట్లు.. మొత్తంగా రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం వచ్చింది. వీటిరాకతో 19,580 ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటిదాకా జరిగిన నాలుగు ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ. 4,32,584 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడం ద్వారా 3,92,680 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.