CM Chandrababu Concerns: బనకచర్లకు అభ్యంతరమెందుకు
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:10 AM
రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృఽథా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు...
ఎగువ రాష్ట్రాల నుంచి వరద వస్తుంటే.. ఆ కష్టనష్టాలను దిగువ రాష్ట్రంగా భరిస్తున్నాం
వృథాగా పోతున్న నీటిని వాడుకోకూడదంటే ఎలా: సీఎం
రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృఽథా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే.. దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం. అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకు? వరదను భరించాలే గానీ.. దాని నుంచి ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుంది’ అని ప్రశ్నించారు. 2027 డిసెంబరునాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ప్రకాశం జిల్లాను కరువు నుంచి బయటపడేసే వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని.. వచ్చే జూలై కల్లా సాగునీరు ఇచ్చే దిశగా పనులు చేస్తున్నామని చెప్పారు.