తిరుపతిని భ్రష్టుపట్టించింది మీరే
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:20 AM
తిరుపతిలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో నలుగురు కార్పొరేటర్లపై వైసీపీ బహిష్కరణ వేటువేసిన విషయం తెలిసిందే.

తండ్రీ కొడుకులకు కార్పొరేటర్ దొడ్డారెడ్డి బహిరంగ లేఖ
తిరుపతి, ఫిబ్రవరి6(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో నలుగురు కార్పొరేటర్లపై వైసీపీ బహిష్కరణ వేటువేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దొడ్డారెడ్డి కుటుంబంపైనే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు ఫోకస్ చేయడం చర్చకు దారితీసింది. దీనికి ప్రతిస్పందనగా వైసీపీ హయాంలో భూమనకు ఆత్మగా వ్యవహరించిన దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి తనయుడు 10వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రతా్పరెడ్డి గురువారం సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ లేఖ రాజకీయంగా చర్చగా మారింది. ‘దివంగత వైఎస్ రాజారెడ్డితో మొదలైన మా రాజకీయ ప్రస్థానం వైఎ్సఆర్తో కలిసి నడిచేలా చేసింది. జగనన్న కష్టకాలంలోనూ పార్టీ వీడకుండా ఎన్ని అవమానాలు ఎదురైనా అంకితభావంతో పనిచేశాం. దానికి బహుమానంగా మాపై సస్పెన్షన్ వేస్తారా? మీ మొండి వైఖరితో పార్టీకోసం కష్టపడినవారిని విస్మరించినందుకే రాయలసీమలో ఏ అభ్యర్థి పొందని ఘోరమైన ఓటమిని తిరుపతిలో మూటకట్టుకున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి కష్టపడ్డ ఒక్క కార్యకర్తకైనా అధికారంలోకి వచ్చాక లబ్ధి చేకూర్చారా? వైఎస్ కుటుంబ కోసం పనిచేశామే గానీ మీలాంటి చరిత్రహీనులకోసం కాదు. తిరుపతిలో పార్టీలకతీతంగా సోదర భావంతో మెలిగే వాతావరణాన్ని మీరే తుడిచివేశారు. మీ నీచమైన రాజకీయాలకోసం, విద్వేష భేషజాలకు ఆజ్యంపోసి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని భ్రష్టుపట్టించింది మీ తండ్రీ కొడుకులే కదా!’ అంటూ పోస్ట్ చేసిన లేఖ వైరల్గా మారింది.