ఆ ఎక్స్కవేటర్ను తప్పించింది ఎవరు?
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:59 AM
ఇసుక అక్రమ రవాణాపై అధికారుల దాడులు ఐదు ట్రాక్టర్ల సీజ్

చంద్రగిరి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): స్వర్ణముఖిలో ఇసుక తవ్వి ట్రాక్టర్లకు పోస్తున్న ఎక్స్కవేటర్ను పట్టుకున్నాక.. తప్పించింది ఎవరు? పోలీసులా లేదా రెవెన్యూ సిబ్బందా అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రగిరి మండలంలోని తొండవాడ నుంచి నరసింగాపురం వరకు స్వరముఖినదిలో రాత్రింబవళ్లు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. దీంతో గురువారం తహసీల్దార్ శివరామసుబ్బయ్య రెవెన్యూ, పోలీసులతో సంయుక్తంగా బృందాలు ఏర్పాటు చేశారు. కాగా, గురువారం రాత్రి చంద్రగిరి బ్రహ్మంగారిగుడి వద్ద భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు తహసీల్దార్కి సమాచారం వచ్చింది. రెవెన్యూ బృందం, పోలీసులు కలిసి రాత్రి 11 గంటల సమయంలో దాడులు నిర్వహించారు. ఐదు ఇసుక ట్రాక్టర్లు, ఒక ఎక్స్కవేటర్ను పట్టుకున్నారు. స్వర్ణముఖినది నుంచి పోలీస్ స్టేషన్కు వాహనాలను తీసుకెళ్లే క్రమంలో ఎక్స్కవేటర్ను కొందరు తప్పించారు. దీనిపై తహసీల్దార్ను వివరణ కోరగా ఐదు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి, పోలీసులకు అప్పగించామన్నారు. ఎక్స్కవేటర్ను పోలీసులు తప్పించారా లేదా రెవెన్యూ సిబ్బందా అనేది విచారిస్తున్నామన్నారు.