శోకసంద్రంలో ఎగువరాగిమానుపెంట
ABN , Publish Date - Jan 22 , 2025 | 01:36 AM
ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి వీరమరణం పొందిన యువ జవాన్ కార్తీక్ యాదవ్కు నేడు స్వగ్రామమైన ఎగువరాగిమానుపెంటలో అధికార లాంఛనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అమర జవాన్ కార్తీక్కు నేడు అంతిమ సంస్కారాలు
బంగారుపాళ్యం,జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి వీరమరణం పొందిన యువ జవాన్ కార్తీక్ యాదవ్కు నేడు స్వగ్రామమైన ఎగువరాగిమానుపెంటలో అధికార లాంఛనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.కార్తీక్ మృతి వార్తతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు.బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమానుపెంట గ్రామానికి చెందిన వరదరాజులు,సెల్వి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ యాదవ్(29) పదేళ్ల క్రితం ఆర్మీలో చేరాడు.రాజస్తాన్ ఆర్మ్డ్ రెజిమెంట్లో ఏడేళ్ళ పాటు పని చేశాక రెండేళ్ళ క్రితం జమ్ముకు బదిలీ అయ్యారు.ఉగ్రవాదులను ఏరివేసే కూంబింగ్ రైఫిల్ విభాగంలో పనిచేస్తున్నారు.ఆదివారం జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన భీకరపోరులో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. ఈ సమాచారాన్ని ఆర్మీ అధికారులు ఫోన్ ద్వారా చెప్పడంతో కార్తీక్ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.శనివారం ఫోన్లో మాట్లాడుతూ శెలవుల్లో ఇంటికి వస్తానని చెప్పాడని,మరుసటి రోజే ఇలా జరిగిందంటూ కార్తీక్ తల్లి కన్నీరు మున్నీరైంది.కార్తీక్ అన్న రాజేష్ మాట్లాడుతూ తన తమ్ముడికి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నామని ఇంతలో ఘోరం జరిగిపోయిందని ఏడుస్తూ చెప్పాడు.కాగా కార్తీక్యాదవ్కు బుధవారం స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కార్తీక్ భౌతికకాయం బుధవారం ఉదయానికి ఎగువరాగిమానుపెంటకు తీసుకొచ్చేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేశారు.అంత్యక్రియల ఏర్పాట్లను తహశీల్దార్ బాబూ రాజేంద్రప్రసాద్,ఆర్ఐ మధుసూదన్ పర్యవేక్షిస్తున్నారు. కాగా వీరజవాన్ కార్తీక్కు స్వగ్రామంలో మంగళవారం రాత్రి స్నేహితులు, గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.