Share News

అత్తను చంపిన అల్లుడు

ABN , Publish Date - Mar 08 , 2025 | 01:44 AM

నగదు, నగల కోసం అత్తను హతమార్చాడు. ఈ ఘటన తిరుపతి నగరం కోలావీధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

అత్తను చంపిన అల్లుడు
హత్యకు గురైన ప్రమీలమ్మ

నగదు, నగల కోసం కిరాతకం

నిందితుడి కోసం పోలీసుల గాలింపు

తిరుపతి(నేరవిభాగం), మార్చి 7(ఆంధ్రజ్యోతి): నగదు, నగల కోసం అత్తను హతమార్చాడు. ఈ ఘటన తిరుపతి నగరం కోలావీధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వెస్ట్‌ పోలీసుల కథనం మేరకు.. ఎర్రావారిపాలెం మండలం బండమీద కమ్మపల్లికి చెందిన గోపాల్‌రెడ్డి, ప్రమీలమ్మ దంపతులు 30 ఏళ్ల కిందట జీవనోపాధి కోసం తిరుపతికి వలస వచ్చారు. కోలావీధిలోని చిన్నగుంట మోక్షిత నిలయంలో కాపురమున్నారు. ఇప్పుడు ప్రమీలమ్మ(53) స్థానికంగా పాచి పనులు చేసుకుంటుండగా.. గోపాల్‌రెడ్డి మేస్ర్తీ పనిచేస్తూ పీపీ చావడి వీధిలోని ఇంట్లో ఉంటున్నాడు. అతడి భార్య ప్రమీలమ్మ చిన్న కుమార్తె రోజా వద్ద ఉంటోంది. రోజాకు తిరుపతికి చెందిన రవినాయక్‌కు ఇచ్చి రెండో వివాహం చేశారు. తిరుమలలో సుమో డ్రైవర్‌గా పనిచేస్తున్న రవినాయక్‌ తాగుడుకు అలవాటు పడ్డాడు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేవాడు. తన ఖర్చులకోసం అత్త ప్రమీలమ్మ వద్ద ఉన్న డబ్బులు, నగలు ఇవ్వాలని శుక్రవారం డిమాండ్‌ చేశాడు. ఆమె నిరాకరించడంతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీనిపై రెచ్చిపోయిన రవినాయక్‌ ఆమె తలను పట్టుకుని ఇంట్లోని గోడకు బలంగా నాలుగైదు సార్లు మోదాడు. తలపై తీవ్రగాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రోజా ఫిర్యాదు మేరకు సీఐ మురళీ మోహన్‌ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడికోసం ఎస్‌ఐ, తన సిబ్బందితో కలిసి తిరుమల, తిరుపతిలో గాలిస్తున్నారు.

Updated Date - Mar 08 , 2025 | 01:44 AM