మిస్సయిన భక్తుడి కోసం..!
ABN , Publish Date - Mar 07 , 2025 | 02:03 AM
అలిపిరి కాలినడకమార్గంలోని అవ్వాచారి కోన లోయలోకి దూకిన వ్యక్తి కోసం భద్రతా సిబ్బంది గురువారం తనిఖీలను కొనసాగించారు.

అవ్వాచారి కోన లోయలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు
తిరుమల, మార్చి6(ఆంధ్రజ్యోతి): అలిపిరి కాలినడకమార్గంలోని అవ్వాచారి కోన లోయలోకి దూకిన వ్యక్తి కోసం భద్రతా సిబ్బంది గురువారం తనిఖీలను కొనసాగించారు. అక్కగార్ల ఆలయానికి సమీపంలో బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి లోయలోకి దూకినట్టు శ్రీహరిబాబు అనే భక్తుడు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు, విజిలెన్స్, ఫారెస్ట్, ఫైర్ అధికారులు, సిబ్బంది దాదాపు 300 మీటర్లు లోయలోకి దిగి గాలించినప్పటికీ ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే. తిరుమల నుంచి బయలుదేరి తిరుపతి చేరుకోని వారి గురించి సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఓ వ్యక్తిని గుర్తించాడు. భక్తుడు చెప్పిన ఆనవాళ్లు కూడా సరిపోవడంతో ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, తిరుమలలో ఏం చేశాడనే అంశాలను తెలుసుకునేందుకు రివర్స్ మోడ్లో సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించగా ఆ వ్యక్తి తిరుమలలో టీ మాస్టార్ గా పనిచేస్తున్న వీరప్ప అనే వ్యక్తిని కలిసినట్టు గుర్తించారు. ఈమేరకు వీరప్పను ప్రశ్నించగా అతని పేరు సిద్దారెడ్డిగా తెలిసింది. సిద్దారెడ్డికి చెందిన ఓ కీ ప్యాడ్ ఫోన్, ఓ జత బట్టలను వీరప్ప పోలీసులకు అందజేశాడు. దీంతో పోలీసులు ఆ దుస్తుల ఆధారంగా డ్యాగ్ స్క్వాడ్తో గురువారం అవ్వాచారి కోనలోయలో గాలించారు. ఈక్రమంలో పోలీసు డాగ్ కేవలం 30 మీటర్లు మాత్రమే లోపలకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చేసింది. దీంతో రెండో రోజూ ఆ వ్యక్తి గురించి ఎలాంటి ఆఽధారాలు లభించలేదు.