తండ్రి వెంటే వెళుతూ..!
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:27 AM
బుడిబుడి అడుగులేస్తూ తండ్రి వెనక వెళ్లాడో మూడేళ్ల బాలుడు. ఆ విషయం తండ్రికి తెలియదు. స్వర్ణముఖి వాగు దాటే క్రమంలో బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన బుధవారం చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ పాతపేట గ్రామంలో చోటుచేసుకుంది.

స్వర్ణముఖి వాగులో పడి బాలుడి మృతి
ఈ విషయం తెలియక పోలీసులకు ఫిర్యాదు
వాగులో కనిపించిన మృతదేహం
చంద్రగిరి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): బుడిబుడి అడుగులేస్తూ తండ్రి వెనక వెళ్లాడో మూడేళ్ల బాలుడు. ఆ విషయం తండ్రికి తెలియదు. స్వర్ణముఖి వాగు దాటే క్రమంలో బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన బుధవారం చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీ పాతపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పాతపేటకు చెందిన లోకేశ్, శరణ్యదంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు. బుధవారం తై అమాస్య కావడంతో.. చనిపోయిన తన తండ్రి రంగాచారికి ఉదయం 11 గంటల సమయంలో లోకేశ్, కుటుంబీకులు ఇంట్లో బట్టలు పెట్టారు. ఆ తర్వాత తన తండ్రి గుంత(సమాధి) వద్దకు లోకశ్ వెళ్లారు. ఇంటి దగ్గర ఆడుకొంటున్న చిన్న కుమారుడు తేజ(3) తండ్రి వెనకాలే వెళ్లిపోయాడు. ఇది గమనించని లోకేశ్.. స్వర్ణముఖి వాగు దాటుకొని తండ్రి గుంత వద్దకు వెళ్లి.. తిరిగి ఇంటికొచ్చారు. తేజ కనిపించకపోవడంతో గాలించారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ సుబ్బరామిరెడ్డి తన సిబ్బందితో జాతీయ రహదారిలో గాలింపు చర్యలు చేపట్టారు. గాందంకి టోల్ప్లాజా వద్ద సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. అనుమానంతో దామలచెరువు వరకు వాహనాలు తనిఖీ చేశారు. స్వర్ణముఖి వాగులో బాలుడి మృతదేహాన్ని గుర్తించిన పశువుల కాపరులు గ్రామస్తులకు సమాచారమిచ్చారు. తమ కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చంద్రగిరి సీహెచ్సీ ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.