Share News

శంకర్‌నాయక్‌ అరెస్టుతో తిరుపతిలో కలకలం

ABN , Publish Date - Feb 24 , 2025 | 01:55 AM

విజయవాడ మాచవరంలోని ఓ స్పా సెంటర్‌లో వైసీపీ నేత వడిత్యా శంకర్‌నాయక్‌ పట్టుబడిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది. ఈ శంకర్‌నాయక్‌ ఎవరు? అతడి నేపథ్యం ఏమిటన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది.

శంకర్‌నాయక్‌ అరెస్టుతో తిరుపతిలో కలకలం
మాజీ సీఎం జగన్‌.. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డితో శంకర్‌నాయక్‌

తిరుపతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): విజయవాడ మాచవరంలోని ఓ స్పా సెంటర్‌లో వైసీపీ నేత వడిత్యా శంకర్‌నాయక్‌ పట్టుబడిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది. ఈ శంకర్‌నాయక్‌ ఎవరు? అతడి నేపథ్యం ఏమిటన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. తిరుపతి కేంద్రంగా విద్యార్థి సంఘ ఉద్యమాల్లో అడుగుపెట్టి.. విద్యార్థి నేతగా, ఆపై ప్రజా సంఘ నాయకుడిగా, చివరికి రాజకీయ నేతగా మారిన శంకర్‌నాయక్‌.. తాజా నిర్వాకంతో ఆయన్ను తెలిసిన వారు విస్తుపోతున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని ఓ గిరిజన తాండాకు చెందిన వడిత్యా శంకర్‌నాయక్‌ డిగ్రీ చదువు కోసం తిరుపతికి వచ్చారు. ఎస్వీఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ, ఎస్వీయూలో పీజీ చేశారు. తొలుత ఓ వామపక్ష విద్యార్థి సంఘంలో చేరి చురుగ్గా పనిచేశారు. అతడి వ్యవహార శైలి బాగాలేదని ఆ పార్టీ ముఖ్యనేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బయటికి వచ్చేశారని సమాచారం. తర్వాత గిరిజన విద్యార్థి సమాఖ్య ఏర్పాటు చేసి గిరిజన, ఆదివాసీల హక్కుల పరిరక్షణ పేరిట కార్యక్రమాలు కొనసాగించారు. ఆ సమయంలో టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం గిరిజనుల పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఏకంగా అట్రాసిటీ కేసు పెట్టారు. ఈ ఘటనతో గిరిజన వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలం తర్వాత ఆ విద్యార్థి సమాఖ్యను గిరిజన ప్రజా సమాఖ్యగా మార్చి.. విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలుగా రాజకీయ కార్యకలాపాలకు దిగారు. ఆ క్రమంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని విమర్శలు, ఆరోపణలు చేసేవారు. అలా వైసీపీ నాయకుల దృష్టిలో పడ్డారు. 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా పనిచేసి వారి ప్రాపకం సంపాదించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగా.. అప్పటి సీఎం జగన్‌ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సన్నిహితుడయ్యారు. ఆ సాన్నిహిత్యంతో రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా నియమితులయ్యారు. గిరిజన విద్యార్థి సమాఖ్య, గిరిజన ప్రజా సమాఖ్యల పేరిట సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో తరచూ జోక్యం చేసుకునే వారని, అధికారులను, సిబ్బందిని వేధించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా క్యాబినేట్‌ హోదా కలిగిన పదవిలో మరింత దూకుడుగా వ్యవహరించారన్న విమర్శలు లేకపోలేదు. తాజాగా విజయవాడ మాచవరం ప్రాంతంలో ఓ స్పా సెంటర్లో వ్యభిచారం నడుస్తోందని వచ్చిన ఫిర్యాదులతో పోలీసులు దాడి చేయగా అక్కడ శంకర్‌నాయక్‌ పట్టుబడ్డారు. ఓ గదిలోని మంచం కింద దాక్కుని ఉన్న ఫొటోలు, వీడియోలు బయటికి రావడంతో తిరుపతిలో విద్యార్థి ప్రజా సంఘాలు విస్తుపోతున్నాయి. ఎస్టీ కమిషన్‌ మెంబరుగా ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. కాగా, తిరుపతికి వచ్చిన ప్రారంభంలో పేదరిక నేపథ్యంలో ఉన్న ఆయన.. ఇప్పుడు ఆర్థికంగా మంచి స్థాయికి చేరారని అతడి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Feb 24 , 2025 | 01:55 AM