Share News

Chief Justice B.R. Gavai: ఎస్సీలకూ క్రీమీలేయర్‌ ఉండాల్సిందే

ABN , Publish Date - Nov 17 , 2025 | 03:32 AM

షెడ్యూల్డ్‌ కులాల్లోని కొందరికి ఇప్పటికీ రిజర్వేషన్‌ ప్రయోజనాలు దక్కని పరిస్థితులు ఉన్నాయని, అలాంటివారికి ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా...

Chief Justice B.R. Gavai: ఎస్సీలకూ క్రీమీలేయర్‌ ఉండాల్సిందే

  • ఆ తీర్పు ఇచ్చినప్పుడు నన్ను తీవ్రంగా విమర్శించారు

  • అయినా తీర్పునకు కట్టుబడి ఉన్నా

  • ఐఏఎస్‌ కొడుకు, కూలీ బిడ్డ సమానమా?

  • ఎస్సీల్లో ఉపవర్గీకరణ బాధ్యతను

  • రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాం

  • ప్రాథమిక హక్కుల రక్షణలో కోర్టులదే కీలక పాత్ర

  • న్యాయం చివరి పౌరుడి వరకు చేరాలి

  • సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వ్యాఖ్యలు

  • ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం

  • కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరు

  • జస్టిస్‌ గవాయ్‌ మానవతావాది: సీఎం

ప్రతి పౌరుడూ దేశ ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలని అంబేడ్కర్‌ భావించారు. దేశ ప్రయోజనాలు ఇమిడి ఉన్నప్పుడు మిగిలినవేవీ ముఖ్యం కాదని ప్రగాఢంగా నమ్మారు.

సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించేందుకు ఆదేశిక సూత్రాలను తీసుకొచ్చారు. దేశ పురోగతికి ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల రెండూ ముఖ్యం. వీటి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు న్యాయస్థానాలు స్పష్టత ఇస్తున్నాయి.

- చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

అమరావతి/గుంటూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్‌ కులాల్లోని కొందరికి ఇప్పటికీ రిజర్వేషన్‌ ప్రయోజనాలు దక్కని పరిస్థితులు ఉన్నాయని, అలాంటివారికి ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా ఉపవర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగిస్తూ తీర్పు ఇచ్చామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ గుర్తుచేశారు. అందులో ఎస్సీలకూ క్రీమీలేయర్‌ వర్తింపజేయాలని చెప్పిన తనను తీవ్రంగా విమర్శించారని.. అయినప్పటికీ ఆ తీర్పును ఇప్పటికీ సమర్థించుకుంటున్నానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో విద్యను అభ్యసించే ఐఏఎస్‌ కుమారుడు, గ్రామంలో ఉండే పేద వ్యవసాయ కూలీ బిడ్డ ఇద్దరూ ఎస్సీ కులాలకు చెందినవారే అయినప్పటికీ.. ఇద్దరినీ సమానంగా చూడలేమన్నారు. అలా చూడడం సమాన అవకాశాలు నిరాకరించడమేనని సీజేఐ తేల్చి చెప్పారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆదివారం ఏపీలోని మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఆయన, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌ ‘ఇండియా అండ్‌ ద లివింగ్‌ ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ ఎట్‌ 75 ఇయర్స్‌’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ దేశంలోని చివరి పౌరుడి వరకు న్యాయం అందాలని.. ఇది న్యాయవ్యవస్థ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణలో కోర్టుల పాత్ర కీలకమని.. హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతమైన అమరావతి నుంచి వచ్చి.. న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని చేపట్టానంటే.. అందుకు భారత రాజ్యాంగమే కారణమని చెప్పారు.


రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే..

‘రాజ్యాంగం కల్పించిన హక్కుల కారణంగానే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కేఆర్‌ నారాయణన్‌, రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా చేశారు. మొదటిసారి మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉన్నారు. ఆమె కేవలం మహిళ మాత్రమే కాదు. గిరిజన సమాజానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యాంగం వల్లే ఒక చాయ్‌వాలా దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. మీ సొంత రాష్ట్రం నుంచి ఎస్సీ వర్గానికి చెందిన బాలయోగి లోక్‌సభ స్పీకర్‌ అయ్యారు. అలానే మహిళా స్పీకర్‌గా మీరాకుమారి బాధ్యతలు నిర్వహించారు. రాజ్యాంగం వల్లే ఎస్సీ వర్గాలకు చెందిన వివిధ రాష్ర్టాల్లో సీఎ్‌సలు, డీజీపీలు అయ్యారు’ అని సీజేఐ స్పష్టం చేశారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నాలుగు స్తంభాలు మన రాజ్యాంగానికి మూలాధారాలని తెలిపారు. 75 ఏళ్లుగా శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు.. సామాజిక, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు పనిచేస్తున్నాయన్నారు. ‘రాజ్యాంగం స్థిరమైన పత్రంగా ఉండకూడదని, వికాసం చెందుతూ సజీవపత్రంగా ఉండాలని అంబేడ్కర్‌ భావించారు. సామాజిక, ఆర్థిక సవాళ్లకు సమాధానం ఇవ్వడాన్ని అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని సవరించేందుకు వీలు కల్పించారు. 1951లో మొదటిసారి రాజ్యాంగానికి పార్లమెంటు సవరణ చేసింది. సుప్రీంకోర్టు సైతం రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంటుకే ఉందని చెప్పింది. సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో పార్లమెంటు రాజ్యాంగ సవరణలు చేస్తూనే వస్తోంది’ అని జస్టిస్‌ గవాయ్‌ వివరించారు.


రెండు అమరావతులు.. యాదృచ్ఛికం

‘అమరావతిలోని ఒక చిన్న మురికివాడలోని మున్సిపల్‌ పాఠశాల నుంచి వచ్చిన నేను న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవిని చేరుకోగలిగాను. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను హాజరైన మొదటి కార్యక్రమం నా స్వస్థలమైన మహారాష్ట్రలోని అమరావతి. ఆ కార్యక్రమానికి.. సీజేఐగా విధులు నిర్వహించి రిటైరైన జస్టిస్‌ ఎన్‌వీ రమణ వచ్చి ఆశీస్సులు అందజేశారు. మరో రెండ్రోజుల్లో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పదవీ విరమణ చేయబోతున్నాను. ఇది నేను హాజరవుతున్న చివరి కార్యక్రమం. అదీ ఇక్కడి అమరావతిలో జరగడం యాదృచ్ఛికం. ఇలా నా ప్రయాణం అమరావతిలో ప్రారంభమై, అమరావతిలోనే ముగుస్తోంది. రెండు అమరావతులకు గొప్ప చారిత్రక ప్రాముఖ్యం ఉంది. మహారాష్ట్రలోని అమరావతిని ఇంద్రపురిగా భావిస్తారు. ఇక్కడి అమరావతిని కూడా ఇంద్రుడి రాజధానిగా భావిస్తుండడం విశేషం’ అని జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు.


ప్రాథమిక హక్కులకు భంగం ఏర్పడితే..

‘రాజ్యాంగ సభ ఏర్పడిన తర్వాత రాజ్యాంగ లక్ష్యాలకు సంబంధించి 1946 డిసెంబరు 9న జవహర్‌లాల్‌ నెహ్రూ తీర్మానం ప్రవేశపెట్టగా.. అందులో లోపాలు ఉన్నాయని అంబేడ్కర్‌ ఎత్తిచూపారు. పౌరుల హక్కుల గురించి మాత్రమే ప్రస్తావించి, పరిష్కారాలు చూపనప్పుడు హక్కుల కల్పనకు అర్థం ఉండదన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు వీలుగా రాజ్యాంగంలో 32వ అధికరణను చేర్చారు’ అని జస్టిస్‌ గవాయ్‌ చెప్పారు.

జస్టిస్‌ గవాయ్‌ గొప్ప మానవతావాది

ఆయన తీర్పులు చిరస్థాయిగా నిలిచిపోతాయి: చంద్రబాబు

కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ను గొప్ప మానవతావాదిగా అభివర్ణించారు. సమానవత్వాన్ని మాటల్లోగాక చేతల్లో చూపించే మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. న్యాయమూర్తిగా ఆయన ఇచ్చిన తీర్పులు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందజేశారు. మోదీ చాయ్‌వాలాగా జీవనం సాగించి నేడు ప్రధానమంత్రి అయ్యారంటే అది రాజ్యాంగం గొప్పదనమే. ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది అంబేడ్కర్‌ ఇచ్చిన వరం’ అని చెప్పారు. సమాజంలో ఏమైనా తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని రక్షించేది న్యాయవ్యవస్థేనన్నారు. సోషల్‌ మీడియా వచ్చాక ప్రతీ ఒక్కరూ సంపాదకులు అయిపోతున్నారని.. వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇద్దరు సీజేఐలూ రాష్ట్రంలోనే..

ఈ నెల 23న పదవీవిరమణ చేయనున్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, ఆ మర్నాడు ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆదివారం ఏపీలోనే ఉండడం యాదృచ్ఛికం. జస్టిస్‌ సూర్యకాంత్‌ తిరుమలేశుడిని దర్శించుకోవడానికి రాష్ట్రానికి వచ్చారు.

శ్రీవారి సేవలో జస్టిస్‌ సూర్యకాంత్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు.

Updated Date - Nov 17 , 2025 | 03:35 AM