CM Chandrababu: రుషికొండపై కోట్లు ఖర్చు చేసిన వారా నన్ను విమర్శించేది
ABN , Publish Date - Jun 22 , 2025 | 07:05 AM
యోగాంధ్ర కోసం ప్రజాధనం వృథా చేశారంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
విశాఖపట్నం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర కోసం ప్రజాధనం వృథా చేశారంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలను శనివారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కొందరు విలేకరులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘ఇలాంటి సందర్భాలలో కొందరి గురించి మాట్లాడడం అనవసరం. రుషికొండపై ప్యాలె్సకు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చుచేసిన వాళ్లా నన్ను విమర్శించేది? ప్రజల సొమ్మును ప్రజాహితం కోసం ఖర్చుచేయాలి తప్ప వ్యక్తిగత విలాసాలకు కాదు. రాష్ట్రాన్ని కలుషితం చేద్దామనుకునేవారి చర్యలను ఉపేక్షించబోను.
ఇటువంటి భూతాన్ని నియంత్రించడానికి ప్రజల్ని చైతన్యపరుస్తాం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేంద్రం రూ.75 కోట్లు ఖర్చు చేసింది’’ అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని, నేరాలు చేసి తప్పించుకునే వారిని, ఆడబిడ్డల జోలికి వచ్చే వారినీ వదిలే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కుప్పం వంటి చోట్ల డబ్బులు ఇవ్వలేదని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. నేరప్రవృత్తి ఉన్నవారికి గత ప్రభుత్వ హయాంలో భయం పోయిందని, అటువంటి వారికి ఒకటి కాదు రెండుసార్లు చెబుతానని, అప్పటికీ మారకపోతే గింగిర్లు తిరిగేలా ట్రీట్మెంట్ ఇస్తానని హెచ్చరించారు.
ప్రజాహితం, ప్రజాభద్రతే ముఖ్యమని, ఇందులో రాజీపడే ప్రసక్తేలేదన్నారు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు తీవ్రవాదంపై పోరాటం చేశానని, చివరకు తనపై దాడి చేసినా వెరవలేదన్నారు. రాయలసీమలో ముఠా కక్షలను అణిచివేశానని, హైదరాబాద్లో మత కల్లోలాలను ఉక్కుపాదంతో నిర్మూలించానని తెలిపారు. విశాఖలో గంజాయి నిర్మూలనకు త్వరలో కార్యాచరణ రూపొందించి అమలుచేస్తామని చంద్రబాబు వివరించారు.