Central Govt: ఉపాధి’ బకాయిలు 961 కోట్లు విడుదల
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:54 AM
ఉపాధి హామీ కూలీలకు బకాయిగా ఉన్న రూ.961.46 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు ఈ సోమ, మంగళవారాల్లో ఖాతాల్లో జమ అవుతాయి
అమరావతి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. కూలీలకు చెల్లించాల్సిన సుమారు రూ.961.46 కోట్ల ఉపాధి వేతన బకాయిలను విడుదల చేసింది. శనివారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి కూలీలకు రావాల్సిన బకాయిలు సోమ, మంగళవారాల్లో వారి ఖాతాల్లో జమ అవుతాయి. కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఇటీవల పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో లేబర్కు సంబంధించిన వేతనాలు విడుదల కావడంతో మెటీరియల్ నిధులు కూడా త్వరలో విడుదల అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. మరో వారంలో రాష్ట్రానికి రావాల్సిన మెటీరియల్ నిధులు విడుదల అవుతాయని, వెంటనే సిమెంట్ రోడ్లు, మినీ గోకులాల బిల్లులు చెల్లించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు.