Basavatarakam Cancer Hospital: M2028 నాటికి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:50 AM
2028 నాటికి అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని అందుబాటులోకి తీసుకువస్తామని బసవతారకం..
21 ఎకరాల్లో 500 పడకలతో హాస్పిటల్ నిర్మాణం
750 కోట్లతో అత్యాధునిక వసతులతో ఏర్పాటు
శంకుస్థాపన చేసిన చైర్మన్ నందమూరి బాలకృష్ణ
గుంటూరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): 2028 నాటికి అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని అందుబాటులోకి తీసుకువస్తామని బసవతారకం ట్రస్టు చైర్మన్ నందమూరి బాలకృష్ణ చెప్పారు. అమరావతిలోని ఈ-7 రోడ్డును ఆనుకుని కేటాయించిన స్థలంలో బుధవారం ఆయన హస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రులు పొంగూరి నారాయణ, సత్యకుమార్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... తుళ్లూరులో 21 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 500 పడకలు అందుబాటులో ఉండేలా రూ.750 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. 25 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్న బసవతారకం రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఇప్పుడు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం గర్వకారణంగా ఉందని బాలకృష్న చెప్పారు. మంత్రి లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఏడీసీ చైర్మన్ లక్ష్మీ పార్థసారథి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, రాజధాని రైతులు, మహిళలు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.