APJAC: సీపీఎస్ ఉద్యోగులపై అక్రమ కేసులు ఉపసంహరించండి
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:33 AM
ఏపీజేఏసీ సీపీఎస్ ఉద్యోగులపై గత వైసీపీ ప్రభుత్వంలో బనాయించిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు వినతి పత్రం అందజేసింది. 3023 కేసులపై ప్రాసెస్ చేయడం కోసం డీజీపీ హామీ ఇచ్చారు

వైసీపీ ప్రభుత్వంలో బనాయించిన కేసులపై డీజీపీకి ఏపీజేఏసీ వినతి
అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): సీపీఎస్ ఉద్యోగులపై గతంలో బనాయించిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని ఏపీజేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు వినతి పత్రం అందజేసింది. ఏపీజేఏసీ చైర్మన్, ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు, కేవీ శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, ఏపీసీపీఎ్సఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం దాస్లు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన 3,023 కేసుల వివరాలను డీజీపీకి అందించామని తెలిపారు. ఈ కేసుల విషయంలో ప్రాసెస్ చేసి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక పంపుతామని డీజీపీ హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీపీఎస్ ఉద్యోగులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలోనే ప్రకటించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం కూడా దీనిపై త్వరగా నిర్ణయం తీసుకుని సీపీఎస్ ఉద్యోగులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని వారు కోరారు.
Read Latest AP News And Telugu News