Share News

Andhra Pradesh Investments: కొత్తగా 39,473 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Jul 18 , 2025 | 03:30 AM

రాష్ట్రంలో కొత్తగా రూ. 39,473 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.

Andhra Pradesh Investments: కొత్తగా 39,473 కోట్ల పెట్టుబడులు

  • 22 ప్రాజెక్టులు.. 30,899 ఉద్యోగాలు

  • ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ

  • ఆతిథ్య రంగంలో సేవలు విస్తరించాలి: సీఎం

  • ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ

అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా రూ. 39,473 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. దీంతో 22 కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఎనిమిదో రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం ఈ నూతన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. పరిశ్రమలు-వాణిజ్యం, ఇంధన, పర్యాటక, ఐటీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. వీటితో కలిపి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్వహించిన ఎస్‌ఐపీబీ సమావేశాల్లో మొత్తం 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటిలో పారిశ్రామిక రంగంలో 46, ఇంధన రంగంలో 41, పర్యాటక రంగంలో 11, ఐటీలో 7, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో 4 పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా మొత్తంగా రూ. 5,74,238 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 5,05,968 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

ఎకోసిస్టంతో స్థానికులకు మేలు: సీఎం

రాష్ట్రంలో ఏర్పాటవుతున్న నూతన పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ ఎకోసిస్టం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ ఎకోసిస్టం ద్వారా ఆయా ప్రాజెక్టులతో పాటు స్థానికులు, అనుబంధ సంస్థలకు మేలు కలుగుతుందని చెప్పారు. పరిశ్రమలకు సమీపంలో రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు తదితర మౌలిక సదుపాయాలతోపాటు ఆ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు (ఎకనామిక్‌ యాక్టివిటీ) పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములిచ్చిన రైతులు, స్థానికులకు ప్రయోజనం చేకూర్చినప్పుడే భూములు ఇవ్వడానికి సంతోషంగా ముందుకు వస్తారని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో నిర్దేశిత గడువులోగా పారిశ్రామిక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. పర్యాటక ప్రాజెక్టుల విషయంలోనూ సమీకృత ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించారు. కేవలం నిర్దేశిత ప్రాజెక్టులకు మాత్రమే పరిమితం కాకుండా వాటికి అనుబంధంగా పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు అవకాశాలు కల్పించాలని చెప్పారు. ప్రత్యేకించి సర్వీస్‌ సెక్టార్‌లో ప్రాజెక్టులను అనుసంధానం చేయాలన్నారు. పీపీపీ విధానంలో చేపట్టే పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను సేకరించి సిద్ధం చేసుకోవాలని అఽధికారులకు సూచించారు. శ్రీశైలానికి పర్యాటకులను ఆకర్షించేలా సమీకృత పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శ్రీశైలం రహదారి విస్తరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆతిఽథ్య రంగంలో కేవలం హోటల్‌ గదులు మాత్రమే కాకుండా.. వినోద కార్యకలాపాలు, సేవల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు వచ్చేలా ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించామనే వివరాలు తెలిసేలా ఎంప్లాయిమెంట్‌ పోర్టల్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు లోకేశ్‌, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, టీజీ భరత్‌, అనగాని సత్యప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌, కందుల దుర్గేష్‌, వాసంశెట్టి సుభా్‌షతో పాటు సీఎస్‌ కె.విజయానంద్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తాజాగా ఎస్‌ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగాలు..

  • ఫినామ్‌ పీపుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ - విశాఖపట్నంలో 205 కోట్ల పెట్టుబడి.. 2,500 ఉద్యోగాలు.

  • శ్రీజా మహిళా ప్రొడ్యూసర్‌ కంపెనీ - చిత్తూరులో 282 కోట్ల పెట్టుబడి.. 1,400 ఉద్యోగాలు.

  • రెన్యూ వ్యోమన్‌ పవర్‌ లిమిటెడ్‌ - కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ. 1,800 కోట్ల పెట్టుబడి.. 380 ఉద్యోగాలు.

  • రెన్యూ విక్రమ్‌ శక్తి ప్రైవేట్‌ లిమిటెడ్‌ - కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ. 3,600 కోట్ల పెట్టుబడి.. 760 ఉద్యోగాలు.

  • జేఎ్‌సడబ్ల్యూ నియో ఎనర్జీ - కడప జిల్లాలో రూ. 2,000 కోట్ల పెట్టుబడి.. 1,380 ఉద్యోగాలు.

  • పీవీఎస్‌ రామ్మోహన్‌ ఇండస్ట్రీస్‌-శ్రీకాకుళం జిల్లా లో 204 కోట్ల పెట్టుబడి.. 1,000 ఉద్యోగాలు.

  • పీవీఎస్‌ గ్రూప్‌ - విజయనగరం జిల్లాలో రూ. 102 కోట్ల పెట్టుబడి.. 500 ఉద్యోగాలు.

  • ఆర్వీఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ - రూ. 4,708 కోట్ల పెట్టుబడితో నంద్యాల జిల్లాలో పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు.. 1,200 ఉద్యోగాలు.

  • ఐటీసీ హోటల్స్‌ లిమిటెడ్‌ - విశాఖలో రూ. 328 కోట్ల పెట్టుబడి.. 1,100 ఉద్యోగాలు.

  • లాన్సమ్‌ లీజర్స్‌ లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ - విశాఖలో 86 కోట్ల పెట్టుబడి.. 720 ఉద్యోగాలు.

  • స్టార్‌ టర్న్‌ హోటల్స్‌ ఎల్‌ఎల్‌పీ - తిరుపతిలో రూ. 165 కోట్ల పెట్టుబడి.. 720 ఉద్యోగాలు.

  • గ్రీన్‌ ల్యామ్‌ లిమిటెడ్‌ - తిరుపతి జిల్లా నాయుడుపేట సెజ్‌లో రూ. 1,147 కోట్ల పెట్టుబడి.. 1,475 ఉద్యోగాలు.

  • యాక్సెలెంట్‌ ఫార్మా - తిరుపతి శ్రీసిటీలో రూ. 1,358 కోట్ల పెట్టుబడి.. 1,770 ఉద్యోగాలు.

  • అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ - కర్నూలు జిల్లాలో 6,933 కోట్ల పెట్టుబడితో సోలార్‌ సెల్‌, పీవీ మాడ్యూల్‌ ఉత్పత్తి.. 2,138 ఉద్యోగాలు.

  • జేఎ్‌సడబ్ల్యూ ఏపీ స్టీల్‌ ప్లాంట్‌ - రూ. 4,500 కోట్ల పెట్టుబడితో (రెండు దశల్లో) కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌.. 2,500 ఉద్యోగాలు.

  • రెన్యూ ఫోటో వోల్టాయిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ - అనకాపల్లి జిల్లాలో రూ. 3,700 కోట్ల పెట్టుబడి.. 1,200 ఉద్యోగాలు.

  • లారస్‌ ల్యాబ్స్‌ - రూ. 5,630 కోట్ల పెట్టుబడితో అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద ప్రాజెక్టు.. 6,350 ఉద్యోగాలు.

  • లులూ షాపింగ్‌ మాల్స్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ - రూ. 1,222 కోట్ల పెట్టుబడితో విశాఖ, విజయవాడల్లో భారీ షాపింగ్‌ మాల్స్‌.. 1,500 ఉద్యోగాలు.

  • ఏస్‌ ఇంటర్నేషనల్‌ - రూ. 1,000 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లా కుప్పంలో డెయిరీ యూనిట్‌.. 2000 ఉద్యోగాలు.

  • బ్రాండిక్స్‌ ఇండియా అపారెల్‌ సిటీ ఇండియా - అచ్యుతాపురం సెజ్‌లో ఫుట్‌వేర్‌, టాయ్స్‌ తయారీ యూనిట్‌.

  • వీఎ్‌సఆర్‌ సర్కాన్‌ - శ్రీకాకుళం జిల్లాలో రూ. 39 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు.. 246 ఉద్యోగాలు.

  • అవిశా ఫుడ్స్‌ అండ్‌ ఫ్యూయెల్స్‌ - కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో రూ. 500 కోట్ల పెట్టుబడి.. 500 ఉద్యోగాలు.


ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

Updated Date - Jul 18 , 2025 | 03:30 AM