Deepam 2 scheme: రెండో ఉచిత సిలిండర్ సబ్సిడీ విడుదల
ABN , Publish Date - May 02 , 2025 | 05:58 AM
రాష్ట్ర ప్రభుత్వం 'దీపం-2' పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ అందించేందుకు రూ.867 కోట్ల సబ్సిడీ విడుదల చేసింది. ఈ నిధులు వివిధ సంక్షేమ శాఖలకు కేటాయించబడ్డాయి. అదే రోజు, పౌరసరఫరాల శాఖకు కొత్త చీఫ్ విజిలెన్స్ అధికారి గా కె.రంగకుమారిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): ‘దీపం-2’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రెండో ఉచిత గ్యాస్ సిలిండరును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.867 కోట్ల నిధులను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో అందించే ఈ రెండో ఉచిత సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ సంబంధిత సంక్షేమ శాఖల (కార్పొరేషన్లు)కు కేటాయించింది. ఎస్సీ కార్పొరేషన్కు రూ.16,330 లక్షలు, ఎస్టీ కార్పొరేషన్కు రూ.3,870 లక్షలు, బీసీ సంక్షేమ శాఖకు రూ.46,522 లక్షలు, ఈడబ్ల్యూఎస్ విభాగానికి 14,582 లక్షలు, మైనారిటీ సంక్షేమ శాఖకు 5,396 లక్షలు చొప్పున కేటాయించింది. ఈ బడ్జెట్ వినియోగంపై తగిన మార్గదర్శకాలను సూచిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
చీఫ్ విజిలెన్స్ అధికారిగా రంగకుమారి
పౌరసరఫరాల శాఖ చీఫ్ విజిలెన్స్ అధికారిగా కె.రంగకుమారిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె చాలాకాలంగా కమిషన్ కార్యాలయంలో అదనపు డైరెక్టరుగా సేవలందిస్తున్నారు.