ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం.. టైరు కిందపడి చిరిగిన చీరలు
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:03 AM
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పట్టు చీరలు చిరిగిపోయాయని చేనేత కార్మికులు వాగ్వాదానికి దిగారు. ధర్మవరం నుంచి సోమందేపల్లి మీదుగా హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ కాంట్రాక్టు బస్సును ఆపి, డ్రైవర్ను నిలదీశారు.
ఫ బస్సును ఆపి చేనేత కార్మికుల వాగ్వాదం
ఫ స్థానికుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
సోమందేపల్లి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పట్టు చీరలు చిరిగిపోయాయని చేనేత కార్మికులు వాగ్వాదానికి దిగారు. ధర్మవరం నుంచి సోమందేపల్లి మీదుగా హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ కాంట్రాక్టు బస్సును ఆపి, డ్రైవర్ను నిలదీశారు. స్ర్తీశక్తి పథకం అమలులో ఉన్నందున ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఉదయం 9గంటలకు ధర్మవరానికి చీరలు తీసుకెళ్లడానికి బస్టాండు వద్దకు చేరుకున్న గీతా నగర్కు చెందిన చేనేతలు ఆదినారాయణ, అశ్వత్థనారాయణ చీరల బ్యాగులను బస్సులోకి ఎక్కిస్తుండగా డ్రైవర్ బస్సును కదిలించారు. దీంతో చీరలు టైరుకిందపడి దెబ్బతిన్నాయి. మొత్తం 15 చీరలు చిరిగిపోయాయి. ఇందులో ఏడు చీరలు ఎందుకూ పనికిరాకుండాపోయాయి. కార్మికులు బస్సు డ్రైవర్ను నిలదీయగా నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన చేనేతలు ధర్మవరం నుంచి తిరిగి వెళుతున్న బస్సును సోమందేపల్లిలో ఆపి గొడవకు దిగారు. నష్ట పరిహారం ఇవ్వాలని ఆర్టీసీ బస్సు డ్రైవర్, యజమాని రేవంతను డిమాండ్ చేశారు. స్థానికులు కలుగజేసుకుని సర్దిచెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.