KGBV: కేజీబీవీలో కోతుల బెడద
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:06 AM
మండలంలోని పాపిరెడ్డిపల్లి వద్దనున్న కేజీబీవీలో కోతుల బెడద ఎక్కువైంది. కొన్నేళ్లుగా కోతులు హాస్టల్ గదుల్లోకి చొరబడి విద్యార్థుల బ్యాగులోని పుస్తకాలు చిందరవందరచేస్తూ దాచుకున్న తినుబండారాళ్లను ఎత్తుకెళ్తున్నాయి.
పట్టించుకోని అధికారులు
సోమందేపల్లి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని పాపిరెడ్డిపల్లి వద్దనున్న కేజీబీవీలో కోతుల బెడద ఎక్కువైంది. కొన్నేళ్లుగా కోతులు హాస్టల్ గదుల్లోకి చొరబడి విద్యార్థుల బ్యాగులోని పుస్తకాలు చిందరవందరచేస్తూ దాచుకున్న తినుబండారాళ్లను ఎత్తుకెళ్తున్నాయి. అప్పుడప్పుడు విద్యార్థులపై దాడులకు తెగబడుతున్నాయి. వాటి బారినపడి తరచూ విద్యార్థులు గాయపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. నెలలో రెండు నుంచి నాలుగు కేసులు నమోదవువుతున్నట్లు తెలిసింది. పాఠశాల కిటికీలు, వాకిళ్లకు మెష్ లేకపోవడంతో భవనంపై నుంచి కిందకు దిగి తరగతి గదుల్లో చొరబడుతున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. పాఠశాలలో ఆరు నుంచి ఇంటర్ వరకు 261 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 13 మంది బోధన సిబ్బంది, 12 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ప్రతిరోజూ నలుగురు తప్పనిసరిగా కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది వంటశాలలో ఉన్న కూరగాయలు, రేషన కోసం వంట చేసే సమయాల్లో దాడిచేస్తున్నట్లు తెలిపారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పెట్టేవేళ వీటి బెడద నుంచి విద్యార్థులను కాపాడటం కత్తిమదసాములా సిబ్బంది వాపోతున్నారు. గుంపులుగా సంచరిస్తూ భయాందోళన కు గురిచేస్తున్నట్లు తెలిపారు. వాటిని తోలే సమయంలో తిరగబడి మీదకు వస్తున్నాయన్నారు. పై అంతస్తులో ఏడు హాస్టల్ గదులుండగా కిటికీలకు మెష్ వేసినా చించేస్తున్నట్లు తెలిపారు. కిటికీలకున్న కడ్డీలగుండా గదుల్లోకి చొరబడుతున్నాయన్నారు. కిటికీలకు గ్రిల్ ఏర్పాటుచేసి కేజీబీవీపై కంప్లీట్ మెష్ కవరింగ్ చేస్తేగాని సమస్య తీరదని సిబ్బంది చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.80లక్షల నిధులతో ఎన్నికల ముందు మూడో అంతస్తులో 8 గదులు నిర్మాణం చేపట్టారన్నారు. రూ.30లక్షలు విడుదల కాగా నాలుగు గదులు పైకప్పు వరకు, మరో నాలుగు గదులు గోడలదాకా పనులు జరిగాయి. ఇది పూర్తయితే పైన మెష్ ఏర్పాటుకు వీలు కలుగుతుందన్నారు. సమస్యను మంత్రి దృష్టికి గతంలో తీసుకెళ్లామన్నారు. ఆగిన గదులను పూర్తీచేయాలని ప్రభుత్వం స్పందించాలని సిబ్బంది కోరుతున్నారు. కేజీబీవీ విద్యార్థులకు కోతలు బెడద నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని సిబ్బంది, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎస్ఓ అనితను వివరణ కోరగా కోతుల బెడద కొన్నేళ్లుగా ఉందన్నారు. తరగతి గదుల్లోకి, వంట శాలల్లోకి చొరబడుతున్నాయన్నారు. భోజన వేళల్లో కాపలా ఉంచకపోతే విద్యార్థులపై దాడులకు దిగుతున్నాయన్నారు. మంత్రి గతంలో మెష్ ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు.