Share News

వెండిరథంపై బంగారు సాయి

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:37 AM

సత్యసాయి శత జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. సాయికుల్వంతులో వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీసాయి సత్యనారాయణ సామూహిక వ్రతాలను నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పుట్టపర్తిలో మంగళవారం అశేష భక్తులనడుమ సత్యసాయి నారాయణ...

వెండిరథంపై బంగారు సాయి
Sathya Sai Chariot Festival

వైభవంగా సత్యసాయి నారాయణ రథోత్సవం

వేలాదిగా హాజరైన భక్తులు..

పులకించిన పుట్టపర్తి

పుట్టపర్తి, టౌన, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. సాయికుల్వంతులో వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీసాయి సత్యనారాయణ సామూహిక వ్రతాలను నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పుట్టపర్తిలో మంగళవారం అశేష భక్తులనడుమ సత్యసాయి నారాయణ రథోత్సవం జరిగింది. సాయికుల్వంతు మందిరంలో సత్యసాయి స్వర్ణ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ విగ్రహాన్ని, వేణుగోపాలస్వామి, సీతారాముల ఉత్సవ మూర్తులను గోపురం వద్దకు తోడ్కొని వచ్చి వెండి రథంపై కొలువుదీర్చారు. సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ హారతి ఇచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథం ముందు విద్యార్థులు వేదమంత్రాలు పటిస్తూ నడవగా, వారి వెనుక మంగళవాయుద్యాలు, భజనలు, కోలాటం, గురవయ్యల నృత్యం, దేవతా వేషధారణలో చిన్నారులు కదిలారు. ఈ వేడుకను చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సత్యసాయి రథోత్సవంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ భక్తులు తమ తమ ప్రాంతాల సంప్రదాయ నృత్యాలతో అలరించారు. రథోత్సవంపై డ్రోన కెమరాతో పూల వర్షం కురిపించారు. పెద వెంకమరాజు కల్యాణ మండపానికి చేరుకున్న అనంతరం రథానికి రత్నాకర్‌, వేద పండితులు మంగళహారతి ఇచ్చి రథోత్సవాన్ని ముగించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు, మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, నవిత, సత్యకుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూరా రెడ్డి, మాజీ ఎంపీ మురళీ మోహన, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజినప్ప, బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మహిళల ద్వారా సమాజానికి సంస్కృతిని, సేవలను, ఆధ్యాత్మికతను పంచేందుకే సత్యసాయి 30 ఏళ్ల క్రితం, 1995లో శ్రీసత్యసాయి అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ప్రారంభించారు. ఏటా నవంబరు 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది సెంట్రల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 30వ అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని హిల్‌వ్యూ స్డేడియంలోనే నిర్వహిస్తున్నారు. దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఈ క్యాక్రమానికి హాజరుకానున్నారు.

హిల్‌వ్యూ స్టేడియం ముస్తాబు

హిల్‌ వ్యూ స్టేడియంలో బుధవారం జరిగే సత్యసాయ శత జయంతి వేడుకలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వీవీఐపీలు కూర్చునేందుకు ఒక వేదిక, సాంస్కృతిక ప్రదర్శనలకు మరో వేదికను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం స్టేడియంలో భారీ ఎల్‌ఈడీ స్ర్కీనలను ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులకు వేర్వేరు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. భక్తులు, అతిథులకు నారాయణ సేవ, తాగునీరు, వైద్యం, రవాణా.. ఇలా అన్ని సౌకర్యాలను కల్పించారు.

అలరించిన సురాంజలి

సత్యసాయి భక్తులు సురాంజలి పేరిట నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. సాయికుల్వంతు సభా మంటపంలో మంగళవారం రాత్రి అభి, కుమారి అంతరానంది బృందం సంగీత గాన కచేరి నిర్వహించింది. అనంతరం ట్రస్టు ప్రతినిధులు వారిని ఘనంగా సత్కరించారు. సత్యసాయి ప్రేమతత్వంపై విద్యార్థులు భక్తిగీతాలను ఆలపించారు. వేలాది మంది భక్తులు సత్మసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న భక్తులకు నారాయణ సేవను అందించారు.

నేడు ప్రధాని మోదీ రాక

హిల్‌ వ్యూ స్టేడియంలో వేడుకలు

సత్యసాయి సన్నిధిలో సచిన, ఐశ్వర్యా రాయ్‌

పుట్టపర్తికి చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎం, లోకేశ

పుట్టపర్తి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తికి బుధవారం వస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ తదితరులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రధాని ఉదయం 9.30 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఆయనకు స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 12.25 గంటల వరకూ వేడుకలలో పాల్గొంటారు. అనంతరం కోయంబత్తూరుకు వెళతారు. ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పుట్టపర్తికి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

- సత్యసాయి స్మారకంగా రూ.100 నాణేన్ని, నాలుగు తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరిస్తారు. వంద మంది రైతులకు పాడి ఆవులను పంపిణీ చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదేళ్లలోపు బాలికలకు ఆర్థిక భరోసానిచ్చే బృహత్తర పథకాన్ని ప్రారంభిస్తారు. విద్య, వైద్య, సామాజిక రంగాల్లో సేకు సంబంధించిన మరో ప్రధానమైన పథకాన్ని ప్రధాని చేత సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు ఆవిష్కరించే అవకాశం ఉంది.

- హిల్‌ వ్యూ స్టేడియంలో నిర్వహించే వేడుకలలో సుమారు 500 మంది వీవీఐపీలు పాల్గొంటారు. సచిన టెండూల్కర్‌, ఐశ్వర్యా రాయ్‌, మాజీ సీజేఐ జస్టిన ఎన్వీ రమణ తదితరులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు.

- భద్రత కట్టుదిట్టం

శత జయంతి ఉత్సవాలకు బుధవారం లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అధికారులు, పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని పర్యటన ముగిసేదాకా పుట్టపర్తికి వచ్చే వాహానాలను బ్రహ్మణపల్లి, ఎనుములపల్లి, పడమర గేట్‌ మీదుగా మళ్లించారు. అనంతరం యథావిధిగా రాకపోకలు సాగించవచ్చు. కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, జేసీ మౌర్య భరద్వాజ్‌, ఎస్పీ సతీశ కుమార్‌, ట్రస్టు ప్రతినిధులు చక్రవర్తి, నాగానందం, ప్రసాద్‌, డాక్టర్‌ మోహన, సేవాసంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్‌ పాండే, కో ఆర్డీనేటర్‌ కోటేశ్వరరావు, ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు చలం, తెలంగాణ అధ్యక్షుడు వెంకట్రావు, ఏపీ అధ్యక్షుడు లక్ష్మణరావు సహా పలువురు సేవాదళ్‌ ప్రతినిధులు వేడుకలను పర్యవేక్షిస్తున్నారు.

- ఘన స్వాగతం

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ మంగళవారం సాయంత్రం పుట్టపర్తికి చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి రెవెన్యూ, జిల్లా ఇనచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఎంపీ బీకే పార్థసారథి, ఛీప్‌ సెక్రటరీ విజయానంద్‌, కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఎస్పీ సతీష్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు పల్లె సింధూరా రెడ్డి, ఎంఎస్‌ రాజు, కందికుంట వెంకటప్రసాద్‌, బండారు శ్రావణి, దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, ఆర్టీసీ జోనల్‌ చైర్మెన పూల నాగరాజు, మాజీ మంత్రి పల్లెరఘునాథ రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ జిల్లా అధ్యక్షులు కొల్లకుంట్ల అంజనప్ప, వెంకటశివుడు యాదవ్‌ తదితరులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి షాదీ మహాల్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక టెంట్‌ హౌస్‌లో బసచేశారు. మంత్రి లోకేశ కప్పలబండ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన టెంట్‌ హౌస్‌లో బసచేశారు.

Updated Date - Nov 19 , 2025 | 12:37 AM