NITI Aayog Electricity Policy: అందుబాటులో చౌక విద్యుత్తు
ABN , Publish Date - Jun 07 , 2025 | 03:09 AM
విద్యుదుత్పత్తి, ప్రవాహ, కొనుగోలు వ్యయాలను భారీగా తగ్గించడం ద్వారా వినియోగదారులకు కరెంటును చౌకగా అందించడమే లక్ష్యంగా విద్యుత్తు రంగం పురోభివృద్ధి సాధించాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశం తీర్మానించింది.
ఉత్పత్తి, ప్రవాహ, కొనుగోలు వ్యయాలు భారీగా తగ్గించాలి
నీతి ఆయోగ్ సీఈవో, సీఎస్ పర్యవేక్షణలో స్టీరింగ్ కమిటీలు
ఇంధన రంగం స్థితిగతులపై ఎప్పటికప్పుడు అధ్యయనం
విద్యుత్తు ప్రవాహ చార్జీల తగ్గింపుపై ఐఎస్ఈజీఎఫ్తో ఒప్పందం
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): విద్యుదుత్పత్తి, ప్రవాహ, కొనుగోలు వ్యయాలను భారీగా తగ్గించడం ద్వారా వినియోగదారులకు కరెంటును చౌకగా అందించడమే లక్ష్యంగా విద్యుత్తు రంగం పురోభివృద్ధి సాధించాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశం తీర్మానించింది. విద్యుత్తు ప్రవాహ చార్జీల తగ్గింపుపై ఐఎ్సఈజీ ఫౌండేషన్తో రాష్ట్ర ఇంధన శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తదితరుల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో విద్యుదుత్పత్తిని పెంచడంతో సహా ప్రవాహ వ్యయం భారీగా తగ్గే దిశగా చర్యలు తీసుకుంటూ అంతిమంగా వినియోగదారునికి చౌకగా కరెంటును అందించాలని నీతి ఆయోగ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ సీఈవో చైర్మన్గా, రాష్ట్రస్థాయిలో సీఎస్ పర్యవేక్షణలో స్టీరింగ్ కమిటీలను నియమిస్తూ సమావేశం తీర్మానించింది. నీతిఆయోగ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి, కేంద్ర పునరుద్పాదక ఇంధన వనరుల శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. రాష్ట్రస్థాయి కమిటీలో ఇంధన, రవాణా, రోడ్లు, భవనాలు, జల వనరుల శాఖ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఐటీ, పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఇంధన రంగం స్థితిగతులపై ఈ కమిటీలు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తాయి.
జాతీయ స్థాయిలో 3నెలలకు ఒకసారి, రాష్ట్రస్థాయిలో నెలవారీ సమీక్షలు నిర్వహిస్తాయి. తాజా ఒప్పందం మేరకు ఇంధన రంగంలో కీలకాంశాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తూ సంస్థాగతమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మేరకు ఐఎ్సఎ్ఫజీ ఫౌండేషన్ సలహాలు, సూచనలు ఇస్తుంది. దీనివల్ల చౌకయిన, నాణ్యమైన విద్యుద్పుత్తిని సాధించడం సాధ్యపడనుంది. అత్యాధునిక సాంకేతిక విధానాలను అవలంబించేందుకూ వీలు కలుగుతుంది. కాగా, రాష్ట్రంలో 21.3 గిగావాట్ల సౌర, 12.3 గిగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్లను రూ.5.78 లక్షల కోట్లతో స్థాపించేందుకు వివిధ సంస్థలతో ఇంధన శాఖ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో ప్రధానంగా ఏపీఎన్జీఈఎల్, హరిత్ అమృత్ లిమిటెడ్ (ఎన్టీపీసీ గ్రీన్ఎనర్జీ లిమిటెడ్- ఏపీ ఎన్ఆర్ఈడీసీఏపీ) సంయుక్తంగా 25 గిగావాట్ల హైబ్రిడ్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంటును రూ.1,65,000 కోట్లతో, ఎన్హెచ్పీసీ రూ.1,00,000 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్ల కోసం రూ.65,000 కోట్లు, రెన్యూ హైబ్రిడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంటు కోసం రూ.22,000 కోట్లు, టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ 7 గిగావాట్ల హైబ్రిడ్ పవర్ ఉత్పత్తి కోసం రూ.49,000 కోట్లు, ఓఎన్జీసీ త్రిపుర పవర్ కంపెనీ 2.7 గిగావాట్ల పంప్డ్ స్టోరేజీ, 1.5 గిగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.21000 కోట్లు, హీరో ఫ్యూచర్ ఎనరీస్ అండ్ రాక్మేన్ ఇండస్ట్రీస్ ఏటా 25 టన్నుల హైడ్రోజన్ ప్లాంట్ను రూ.1.000 కోట్లతో స్థాపించేందుకు ఒప్పందాలు చేసుకోవడం నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.