ACB Court: విడదల గోపి పిటిషన్లపై తీర్పు రిజర్వు
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:00 AM
మాజీ మంత్రి విడదల రజనీ మరిది వేణుగోపాలకృష్ణ (గోపి) బెయిల్ మరియు కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. గ్రానైట్ వ్యాపారులను బెదిరించి రూ.కోట్లు వసూలు చేసిన కేసులో తీర్పును బుధవారానికి రిజర్వ్ చేశారు
విజయవాడ, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): గ్రానైట్ వ్యాపారులను బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి విడదల రజనీ మరిది వేణుగోపాలకృష్ణ(గోపి) పిటిషన్లపై వాదనలు మంగళవారం ముగిశాయి. గోిపీని పోలీసు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని గోపీ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ప్రాసిక్యూషన్ తరఫున ఏసీబీ ప్రత్యేక పీపీ శేషయ్య వాదనలు వినిపించారు. ‘రజనీ మంత్రిగా ఉన్నప్పుడు గ్రానైట్ వ్యాపారులను బెదిరించిన కేసులో గోపీకి బెయిల్ మంజూరు చేస్తే ఫిర్యాదుదారులు, సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నాయి’ అని శేషయ్య వాదించారు. వాదనలు విన్న అనంతరం ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు తీర్పును బుధవారానికి రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.