Anantapur Tragedy: నిండు ప్రాణం తీసిన వేడి టీ.. టీ తాగిన రెండు రోజులకు..
ABN , Publish Date - Oct 11 , 2025 | 08:29 AM
చాముండేశ్వరి వేడి వేడి టీని ప్లాస్క్లో పోసి ఉంచింది. దాహంతో ఉన్న హృతిక్ ప్లాస్క్లో నీళ్లు ఉన్నాయనుకుని పొరపాటున వేడి వేడి టీ తాగేశాడు. గొంతు భగ్గుమనటంతో విలవిల్లాడాడు.
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేడి టీ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పొరపాటున వేడి వేడి టీ తాగిన నాలుగేళ్ల బాలుడు ఆస్పత్రిపాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. యాడికి ప్రాంతానికి చెందిన రామస్వామి, చాముండేశ్వరి భార్యాభర్తలు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు హృతిక్ వయసు నాలుగేళ్లు కాగా, కూతురు యశస్వినికి ఏడాదిన్నర.
రామస్వామి దంపతులు యాడికిలోని చెన్నకేశవ స్వామి కాలనీలో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం చాముండేశ్వరి వేడి వేడి టీని ప్లాస్క్లో పోసి ఉంచింది. దాహంతో ఉన్న హృతిక్ ప్లాస్క్లో నీళ్లు ఉన్నాయనుకుని పొరపాటున వేడి వేడి టీ తాగేశాడు. గొంతు భగ్గుమనటంతో విలవిల్లాడాడు. గట్టిగా ఏడవటం మొదలెట్టాడు. కొద్దిసేపటికే స్ప్రహ తప్పిపడిపోయాడు. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడ్ని తాడిపత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవటంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇలా బెల్లం టీ తయారు చేస్తే.. జలుబు, దగ్గు నుండి తక్షణ ఉపశమనం..
పెళ్లై 10 నెలలు.. చీర బహుమతిగా ఇవ్వలేదని..