Investment Scam: అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.150 కోట్లకు టోపీ
ABN , Publish Date - May 31 , 2025 | 05:01 AM
హైదరాబాద్ జీడిమెట్లలో పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరిట రూ.150 కోట్లకు పైగా మోసం జరిగింది. డబ్బులు రెట్టింపు చేస్తామంటూ 1,530 మందిని నమ్మించి మోసపుచేశారు.
816 నెలల్లో సొమ్ము డబుల్ అంటూ 1,530 మంది నుంచి డిపాజిట్లు వసూలు
తిరిగి చెల్లించకుండా చేతులెత్తేసిన పెంగ్విన్ సెక్యూరిటీస్ సర్వీసెస్ సంస్థ
జీడిమెట్ల, మే 30(ఆంధ్రజ్యోతి): లక్ష పెట్టుబడితో.. 16 నెలల్లో రెండింతలు ఇస్తామని ఆశ చూపారు. డిపాజిట్లు చెల్లించినవారికి బాండ్ రాసిచ్చారు. కొందరికి అధికంగా డబ్బులిచ్చి నమ్మించారు. సుమారు 1,530 మంది నుంచి రూ.150 కోట్లకుపైగా వసూ లు చేశారు. ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. హైదరాబాద్ శివార్లలోని జీడిమెట్లలో ఈ భారీ మోసం వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. జీడిమెట్ల సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర కు చెందిన వడైగర్ బాలాజీ(35), తండ్లే చౌదరి స్వాతి(30) 2023లో చింతల్ సూర్యానగర్లోని రిడ్జ్ టవర్స్లో పెంగ్విన్ సెక్యురిటీస్ సర్వీసెస్ పేరిట సంస్థను నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఎల్బీ నగర్, అత్తాపూర్లలోనూ కార్యాలయాలు పెట్టారు. రూ.లక్ష డిపాజిట్ చేస్తే 16 నెలల్లో రూ.2 లక్షలు ఇస్తామని ఆశ చూపారు. షేర్ మార్కెట్లో పెట్టి భారీ లాభాలు ఆర్జిస్తామని, అందువల్లే అధిక వడ్డీ ఇస్తున్నామని నమ్మించారు. డబ్బులు కట్టేవారికి బాండ్ పేపర్ కూడా రాసిచ్చేవారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలవారు అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో ఈ సంస్ధలో డబ్బులు డిపాజిట్ చేశారు. కొందరు రూ.కోటి వరకు కూడా కట్టారు. వారిలో కొందరికి సంస్థ నిర్వాహకులు అధిక వడ్డీ చెల్లించారు. ఇది చూసి కొందరు తమ బంధువులను, స్నేహితులను ఈ సంస్ధలో చేర్పించి, డబ్బులు కట్టించారు. 16 నెలల గడువు పూర్తయినవారు గత 2 నెలలుగా కార్యాలయానికి వస్తున్నారు. నిర్వాహకులు ఏదో ఓ కారణం చెబుతూ తిప్పుకుంటూ వస్తున్నారు. 30న(శుక్రవారం) డబ్బులు ఇస్తామని కొందరికి చెప్పడంతో.. సుమారు 100 మంది వరకు కార్యాలయానికి వచ్చారు. కానీ కార్యాల యం మూసివేయడంతో మోసపోయామని గుర్తించి, పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిర్వాహకురాలు స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. చింతల్లోని కార్యాలయాన్ని సీజ్ చేశారు. బాలాజీ పరారీలో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News