Share News

Bandi Sanjay : కేసీఆర్‌కు ఎందుకు నోటీసులివ్వరు?

ABN , Publish Date - May 03 , 2024 | 05:04 AM

కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఒక మంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసీఆర్‌ కుటుంబాన్ని కాపాడేందుకు ఆయన చీకటి ఒప్పందం

 Bandi Sanjay : కేసీఆర్‌కు ఎందుకు నోటీసులివ్వరు?

ట్యాపింగ్‌ కేసులో స్పష్టంగా ఆయన పాత్ర.. ఇది రాధాకిషన్‌ రావు స్టేట్‌మెంట్‌లో ఉంది

కేసీఆర్‌ను కాపాడేందుకు ఓ మంత్రి చీకటి ఒప్పందం

నేను, సీఎం రేవంత్‌, హరీశ్‌ రావు ట్యాపింగ్‌ బాధితులం: సంజయ్‌

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఒక మంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసీఆర్‌ కుటుంబాన్ని కాపాడేందుకు ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావే నిధులు సమకూర్చారని, ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్న కరీంనగర్‌ జిల్లా మంత్రి ఇందులో మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి తెలియకుండా సదరు మంత్రి బీఆర్‌ఎస్‌ నాయకత్వంతో చీకటి ఒప్పందం చేసుకుని ఈ వ్యవహారం నడిపారని చెప్పారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు. ‘ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావు మీ పార్టీ నాయకులకు నిధులు ఇచ్చిన విషయం మీకు తెలుసా? కేసీఆర్‌ ఆదేశాల మేరకే ట్యాపింగ్‌ చేసినట్లు ప్రధాన నిందితుల్లో ఒకరైన రాధాకిషన్‌రావు తన స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేశారు. ఆ విషయాన్ని ఎందుకు బహిర్గతం చేయటం లేదు? ఎందుకు క్రిమినల్‌ చర్యలు చేపట్టడం లేదు? కేసీఆర్‌ కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కనీసం 41ఏ నోటీసు ఎందుకు ఇవ్వడం లేదు?’ అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బండి సంజయ్‌ నిలదీశారు. కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే ఈ వాస్తవాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం వెల్లడించలేదని ఆరోపించారు. కేసును మూసివేయడంలో భాగంగానే కేసీఆర్‌, కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్‌ అనే నాణేనికి కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు బొమ్మా బొరుసులాంటి వాళ్లని విమర్శించారు. నాటి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్లు రాధాకిషన్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో స్పష్టంగా ఉందని పేర్కొంటూ, ఇందుకు సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీని మీడియా సమావేశంలో సంజయ్‌ ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తక్షణం ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి, ఎన్‌ఐఏకు అప్పగించాలన్నారు. కీలక ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి డ్రామాలాడుతున్నారని, గతంలో కేసీఆర్‌ అనుసరించిన పంథానే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు... విచారణలు.. అరెస్టులు.. రిమాండ్‌లు జరిగాయి. అంత తీవ్రమైన కేసుపై ఇప్పుడు చర్చ కూడా లేదు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కై ఈ కేసును పక్కదారి పట్టించాయి. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయి. కేసీఆర్‌ హయాంలో నయీం కేసు, డ్రగ్స్‌, మియాపూర్‌ భూ కుంభకోణం, ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల కేసుల్లో సిట్‌లు వేసి మూసివేశారు. ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును కూడా అదే విధంగా మూసివేయబోతున్నారు’ అని పేర్కొన్నారు. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని, ప్రణీత్‌రావు అక్కడ వార్‌ రూం ఏర్పాటుచేసుకుని ట్యాపింగ్‌ చేశారని ఆరోపించారు.

రేవంత్‌, హరీశ్‌ కూడా బాధితులే

ఫోన్‌ ట్యాపింగ్‌కు తనతోపాటు సీఎం రేవంత్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా బాధితులేనని బండి సంజయ్‌ తెలిపారు. కేసీఆర్‌ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది తానే కాబట్టి తన ఫోన్‌ను ట్యాపింగ్‌ చేశారన్నారు. ఇటీవల ఒక పోలీసు అధికారి తనకు తెలిపిన వివరాల ప్రకారం తమ ఇంటి సమీపంలోని పెట్రోలు బంకులో రెండు వాహనాలు ఏర్పాటు చేశారని, మా కుటుంబ సభ్యులు, సిబ్బంది వాడే అన్ని ఫోన్లనూ ఇజ్రాయెల్‌ టెక్నాలజీతో ట్యాపింగ్‌ చేశారని తెలిపారు.

ప్రభాకర్‌రావు ప్లాన్‌ ప్రకారం..

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోబోతోందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నాటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావు గుర్తించారని, కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు లేకపోతే ఇబ్బందులొస్తాయని గుర్తించారని బండి సంజయ్‌ పేర్కొన్నారు. ‘ప్రభాకర్‌రావుతోపాటు రాధాకిషన్‌రావు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్‌ వచ్చారు. ప్రతిమ హోటల్‌లో రూం నెంబరు 314లో రాధాకిషన్‌రావు ఉన్నరు. హోటల్‌ బిల్లులు చెల్లించకుండా, రికార్డుల్లో పేరు నమోదు చేయించకుండా అక్కడే మకాం వేసి అవసరమైన వాళ్ల ఫోన్లను ట్యాప్‌ చేయించారు. ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావు కరీంనగర్‌ వాసి. ప్రస్తుతం, కాంగ్రెస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు ఆర్థిక వ్యవహారాలను చూసేది ఈ అశోక్‌రావే. రాజేందర్‌రావు ఉంటున్నది కూడా అశోక్‌రావు ఇంట్లోనే. ఈ అశోక్‌రావును కరీంనగర్‌ జిల్లాకు చెందిన క్యాబినెట్‌ మంత్రి, సీఎం రేవంత్‌కు పరిచయం చేయించారు. మరికొంతమంది సహచర మంత్రులకు కలిపించారు. కాంగ్రె్‌సలో కార్యకర్త కూడా కాని రాజేందర్‌రావుకు ఆ పార్టీ ఎంపీ టికెట్‌ రావడానికి ప్రధాన కారకుడు ప్రభాకర్‌రావే. ఈ సందర్భంగా పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయి. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ అభ్యర్థులకు ప్రభాకర్‌రావే డబ్బులు పంపించారు. ఇందులో సదరు మంత్రికి కొంత ఎక్కువ ఇచ్చారు’ అని సంజయ్‌ వివరించారు. డబ్బులు పంపించింది ప్రభాకర్‌రావు అన్న సంగతి కూడా చాలామంది కాంగ్రెస్‌ అభ్యర్థులకు అప్పట్లో తెలియదన్నారు. ‘కాంగ్రెస్‌ నాయకులకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా, జాతీయ స్థాయి నాయకులకు కూడా అమెరికా నుంచి డబ్బులు వచ్చే ఏర్పాట్లు చేశారు ప్రభాకర్‌రావు. అందుకే, సీఎం రేవంత్‌ ఎంత పోరాడినా తాను కరీంనగర్‌లో ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్‌ ఇప్పించుకోలేకపోయారు. సీఎం చెప్పిన అభ్యర్థికి టికెట్‌ రాలేదంటే ఎంత భారీఎత్తున డబ్బులు చేతులు మారాయో ఊహించుకోవచ్చు. ఈ విషయం రేవంత్‌కు తెలుసని అనుకోవడం లేదు’ అని సంజయ్‌ పేర్కొన్నారు.


అశోక్‌రావు ఇంట్లో కాంగ్రెస్‌ అభ్యర్థి

కరీంనగర్‌లోని ప్రభాకర్‌రావు వియ్యంకుడు అశోక్‌రావు ఇంట్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉంటున్నారని, అమెరికాలో అశోక్‌రావు కూతురి ఇంట్లో ప్రభాకర్‌రావు ఉంటున్నారని సంజయ్‌ తెలిపారు. ప్రభాకర్‌రావుకు ఇంకా పదేళ్ల వీసా గడువు ఉందని, ఆయన ఇప్పట్లో రారని చెప్పారు. ఆయన రావొద్దనే కాంగ్రెస్‌ నాయకులు కోరుకుంటున్నారని.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నేపథ్యంలో, ఎక్కడ నోటీసులు వస్తాయోనన్న భయంతో డబ్బులు తీసుకోవడానికి కరీంనగర్‌లో కాంగ్రెస్‌ స్థానిక నాయకులు భయపడుతున్నారన్నారు. ఫోన్‌ట్యాపింగ్‌, ఆరు గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెచ్చారని ఆరోపించారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పెడుతున్న ఖర్చంతా అమెరికా నుంచి ప్రభాకర్‌రావు పంపించిందేనన్నారు. ట్యాపింగ్‌తో సంబంధం లేదని భావిస్తే.. సీబీఐ విచారణ కోరాలి అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎ్‌సతో కుమ్మక్కైనట్లు అంగీకరించినట్లేనన్నారు.


ఇప్పటికీ ఫోన్‌ ట్యాపింగ్‌!

ఫోన్‌ట్యాపింగ్‌ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న పట్టుదల సీఎం రేవంత్‌కు ఉన్నా, కాంగ్రెస్‌ అధినాయకత్వం అంగీకరించకపోవచ్చని సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ జాతీయ నేతలకు సైతం ఇక్కడి మంత్రి ద్వారా డబ్బులు అందడమే దానికి కారణమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతోందని.. చాలామంది అధికారులు ఫోన్లలో మాట్లాడుకోవడం లేదని తెలిపారు.

Updated Date - May 03 , 2024 | 05:04 AM