Share News

Kavitha Arrest: కారుతో దోస్తీ లేదని చాటుకోవడానికే!.. కవిత అరెస్టు ఈ నేపథ్యంలోనే?

ABN , Publish Date - Mar 16 , 2024 | 04:18 AM

తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకొని, రాష్ట్ర రాజకీయాలపై పట్టు బిగించేందుకే బీజేపీ కార్యాచరణ చేపట్టిందా? ఇందులో భాగంగానే బీఆర్‌ఎ్‌సను బలహీనపరిచి

Kavitha Arrest: కారుతో దోస్తీ లేదని చాటుకోవడానికే!.. కవిత అరెస్టు ఈ నేపథ్యంలోనే?

బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉందన్న ప్రచారంతో బీజేపీకి తీవ్ర నష్టం

అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన ప్రభావం

కాంగ్రెస్‌ ప్రచారాన్ని తిప్పికొట్టలేని నిస్సహాయతలో బీజేపీ రాష్ట్ర నేతలు

లోక్‌సభ ఎన్నికలకూ అదే సమస్య

అధిష్ఠానానికి తెలిపిన శ్రేణులు

ఈ నేపథ్యంలోనే కవిత అరెస్టు?

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకొని, రాష్ట్ర రాజకీయాలపై పట్టు బిగించేందుకే బీజేపీ కార్యాచరణ చేపట్టిందా? ఇందులో భాగంగానే బీఆర్‌ఎ్‌సను బలహీనపరిచి రాష్ట్రంలో ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తోందా? బీఆర్‌ఎ్‌సతో తమకు తెర చాటు బంధం లేదని ఎంత చెప్పినా ప్రజలు విశ్వసించని నేపథ్యంలోనే కవిత అరెస్టు ద్వారా బ్రహ్మాస్త్రం ప్రయోగించిందా?.. అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 స్థానాలు గెలుచుకోవడం లక్ష్యంగా పని చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన తమ విస్తరణకు తెలంగాణ కీలకమని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందున ఆ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు తమ వైపు వచ్చే అవకాశం లేదని గుర్తించి.. బీఆర్‌ఎ్‌సపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఒకవైపు, బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎంపీలతో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతల కోసం ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టిన బీజేపీ, మరోవైపు బీఆర్‌ఎ్‌సను బలహీనపరిచేందుకు అంతర్గత కార్యాచరణకు నడుం బిగించిందన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎంపీలతో పాటు పలువురు సీనియర్‌ నాయకులు ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్టయితే ఆ పార్టీపై మరింత ప్రభావం చూపుతుందని, గులాబీ నేతలు ఎక్కువ మంది తమవైపు వస్తారన్న అంచనాల్లో బీజేపీ ముఖ్యనేతలు ఉన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు శుక్రవారం హైదరాబాద్‌ గడ్డపై కాలుపెట్టిన సందర్భం... మరోవైపు ఎన్నికల షెడ్యూలుకు 24 గంటల ముందు.. కవితను ఈడీ అరెస్టు చేయడం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం

వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవితను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. అయినా కవిత అరెస్టు కాలేదు. ఆమెను అరెస్టు చేస్తే, బీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా సానుభూతి పవనాలు వీయవచ్చని బీజేపీ అధిష్ఠానం భావించినందువల్లే అరెస్టు జరగలేదని విశ్లేషణలు వెలువడ్డయి. ఇదే అదనుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనంటూ కాంగ్రెస్‌ విస్తృత ప్రచారం చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటేనన్న ప్రచారం కాంగ్రె్‌సకు అనుకూలించిందన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో బలంగా ఉంది. కవితను అరెస్టు చేసి ఉంటే సమీకరణాలు మరోలా ఉండేవని, అసెంబ్లీ ఎన్నికల్లో తమకు గణనీయంగా సీట్లు లభించి ఉండేవని ఆ పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత పేర్కొన్నారు. బండి సంజయ్‌ని అకస్మాత్తుగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారు? కవితను ఎందుకు అరెస్టు చేయలేదు? అంటూ కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు తమ వద్ద సమాధానాలే ఉండేవి కావని మరో నేత తెలిపారు. ఇదే అంశాన్ని లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్థానిక నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు జాతీయ నాయకత్వానికి నివేదించారు. బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒక్కటేననే ప్రచారాన్ని కాంగ్రెస్‌ మరోసారి చేస్తోందన్న సంగతినీ తెలియజేశారు. కవిత అరెస్టు జరిగితే దీన్ని తిప్పికొట్టటంతోపాటు తమకు బీఆర్‌ఎ్‌సతో పొత్తు లేదని నిరూపించుకున్నట్లు అవుతుందని తెలిపారు. మరోవైపు, బీఆర్‌ఎ్‌సతో ఎలాంటి పొత్తూ లేదని పార్టీ జాతీయ నాయకత్వం అంతర్గత సమావేశాల్లో పలుమార్లు చెప్పినా రాష్ట్ర శ్రేణులు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. కేసీఆర్‌ను వ్యతిరేకించి బీజేపీలో చేరిన సీనియర్‌ నేతలు కొంతమంది కాంగ్రె్‌సలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే, కవిత అరెస్టు జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీఆర్‌ఎ్‌సతో తమకు అవగాహన లేదని నిరూపించుకోవాల్సిన అనివార్య పరిస్థితుల్లోనే కవిత అరెస్టుకు కేంద్రంలోని పెద్దలు పచ్చజెండా ఊపి ఉంటారని పేర్కొంటున్నారు. మరోవైపు, ఎలక్టోరల్‌ బాండ్స్‌ అంశం బీజేపీకి తలనొప్పిగా మారిన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే కవిత అరెస్టు జరిగిందన్న వాదనా రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.

Updated Date - Mar 16 , 2024 | 09:40 AM