అల్లు అర్జున్.. రూ.10లక్షల డీడీ పంపారు
ABN , Publish Date - Dec 25 , 2024 | 05:14 AM
శ్రీతేజ్ కళ్లు తెరిచి చూశాడు కానీ.. తనను గుర్తు పట్టడం లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రి కోమటిరెడ్డి రూ.25లక్షలు, మైత్రీ మూవీస్ తరఫున 50లక్షలు అందజేశారు
శ్రీతేజ్ కళ్లు తెరిచినా నన్ను గుర్తు పట్టలేదు
ఆరోగ్యం కొంత మెరుగైంది: శ్రీతేజ్ తండ్రి భాస్కర్
రాంగోపాల్పేట్, డిసెంబర్ 24 ( ఆంధ్రజ్యోతి): శ్రీతేజ్ కళ్లు తెరిచి చూశాడు కానీ.. తనను గుర్తు పట్టడం లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో కొద్దిగా మెరుగుదల కనిపిస్తుందని వివరించారు. ఇప్పటి వరకు మైత్రీ మూవీస్ తరఫున రూ.50లక్షలు అందగా, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రూ.25లక్షలు అందించారని వెల్లడించారు. శ్రీతేజ్ వైద్యం కోసం అల్లు అర్జున్ రూ.10లక్షల డీడీ పంపినట్లు వివరించారు. మీడియా నుంచి తనకు అపూర్వ మద్దతు లభించిందని, అల్లు అర్జున్ సైతం సానుకూలంగా స్పందించడంతో కేసు వాపసు తీసుకుంటున్నాని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ రోజు సినిమా హాల్లోకి ముందుగా తన భార్య పిల్లలు వెళ్లారని, రద్దీ ఎక్కువగా ఉండడంతో తాను వెళ్లలేకపోయానని చెప్పారు. కాసేపటికే తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయిందని తెలిసిందన్నారు. చనిపోయింది తన భార్యేనని, కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిసి నిర్ఘాంత పోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన కుమారుడు శ్రీతేజ్కు వైద్యులు మంచి వైద్యం అందిస్తున్నారని, కానీ కోలుకోవడానికే చాలా సమయం పడుతుందని చెబుతున్నారని తెలిపారు.