మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
ABN , Publish Date - Mar 22 , 2024 | 11:52 PM
మహిళలు చిన్న, చిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డీఆర్డీవో శ్రీనివాస్ అన్నారు.
![మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి](https://media.andhrajyothy.com/media/2024/20240322/22_vkb_41_1a8fe9d559.jpg)
మర్పల్లి, మార్చి 22: మహిళలు చిన్న, చిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని డీఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో శుక్రవారం మహిళలకు కుట్టు మిషన్ల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల యూనీఫాంలు కుట్టేందుకు మర్పల్లి మండలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళలు కుట్టుమిషన్ శిబిరంలో శిక్షణ పొంది యూనిఫాంలు కుడితే వారికి ఉపాధి ఏర్పడినట్లు అవుతుందన్నారు. స్వయం ఉపాధి సంఘాల్లో రుణాలు పొందుతున్న మహిళలు తప్పనిసరిగా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ స్వయంగా అభివృద్ధి చెందడంతో పాటు కుటుంబాలను పోషించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. రుణాలు తీసుకున్న మహిళలు సకాలంలో చెల్లిస్తే తిరిగి రుణం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజమల్లయ్య, ఏపీయం మధుకర్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.