ధ్యాన మార్గంతో సంకల్ప శక్తి
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:40 PM
మానవతా విలువల పెంపు, ఆరోగ్య సమాజ నిర్మాణం, ఆనందమయ జీవనానికి ధ్యానం గొప్ప మార్గమని మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్ రెడ్డి అన్నారు.

పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్రెడ్డి
కొనసాగుతున్న ధ్యాన మహాయాగం వేడుకలు
తెలుగు రాష్ర్టాల నుంచి తరలివస్తున్న ధ్యానులు
ఆకట్టుకున్న నృత్యాలు, ఆధ్యాత్మిక సందేశాలు
కడ్తాల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మానవతా విలువల పెంపు, ఆరోగ్య సమాజ నిర్మాణం, ఆనందమయ జీవనానికి ధ్యానం గొప్ప మార్గమని మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ధ్యానంతో సహనం, సంకల్పశక్తి సిద్ధిస్తుందని, అది వ్యక్తి పురోగమనానికి దోహద పడుతుందని ఆయన పేర్కొన్నారు. కడ్తాల మండలం అన్మాస్పల్లి కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్లో ధ్యాన మహాయాగం-3 వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. రెండవరోజు ఆదివారం తెలుగు రాష్ర్టాల నుండి ధ్యానులు, సాధకులు, పిరమిడ్ మాస్టర్లు, ఆధ్యాత్మిక వేత్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు మాస్టర్ వెంకటేశ్ యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా చైతన్య, తేజలు వేద పఠనం నిర్వహించారు. అనంతరం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఫ్లూట్ మాస్టర్ గణేశ్, సంజయ్కింగ్ల బృందం సంగీత నాద గానంతో ప్రాతఃకాలం ఽసామూహిక ధ్యానం నిర్వహించారు. అనంతరం పత్రీజీ వీడియో సందేశాలను వినిపించారు. ఈసందర్భంగా పత్రీజీ కూతురు పరిణితి మాట్లాడుతూ ప్రపంచాన్ని ధ్యానమయం చేసే లక్ష్యంతో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలన్నారు. కర్నూల్లో పత్రీజీ ప్రారంభించిన ధ్యాన విప్లవం నేడు విశ్వవ్యాప్తం అయ్యిందన్నారు. ప్రముఖ సినీఫైటర్స్ రామ్లక్ష్మణ్లు మాట్లాడుతూ శ్వాస మీద ద్యాసే ధ్యానమని, దాన్ని ప్రతీ ఒక్కరు ఆచరించి ఆనందమయ జీవితాన్ని పొందాలన్నారు. మందులతో నయం కాని ఎన్నో రుగ్మతలు ద్యానం, యోగ ద్వారా తొలిగిపోతాయని వారు పేర్కొన్నారు. గుజరాత్ స్వామి నారాయణ ఆలయ అర్చకుడు జ్ఞానవత్సల స్వామి పిరమిడ్ను సందర్శించి ధ్యానులనుద్దేశించి సందేశమిచ్చార ు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్మన్ లీలాలక్ష్మారెడ్డి, స్వాద్యాయ యోగ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి, పీఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు ఆనంద్ దాలీయా, జగదీశ్ రెడ్డి, కిషన్ రెడ్డి, పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు హన్మంతరావు, సాంబశివరావు, మాధవి, లక్ష్మి, దామోదర్ రెడ్డి, అన్మాస్పల్లి మాజీ సర్పంచ్ శంకర్ పాల్గొన్నారు.