మాకొద్దీ పంచాయతీ కార్యదర్శి
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:09 PM
పంచాయతీ కార్యదర్శి జ్యోత్స్న, కారోబార్ లింగంలను తక్షణమే తొలగించాలని లిఖిత పూర్వకంగా చౌదర్పలి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇంటి రిజిస్ర్టేషన్ (ఆస్తి విలువ తెలిపే) పత్రం ఇవ్వకపోవడంతో గురువారం ముక్కెర మధుసూదన్ అనే వ్యక్తి పురుగులు మందు తాగిన వైనంపై శుక్రవారం డీఎల్పీవో సాధన, ఎంపీవో శ్రీలత గ్రామస్తుల సమక్షంలో విచారణ జరిపారు.

-పైసలు ఇవ్వనిదే పని చేయడం లేదు
-కారోబార్ లింగంపై కూడా చర్యలు తీసుకోండి
-లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన చౌదర్పల్లి గ్రామస్తులు
-‘ఆత్మహత్యాయత్నం ఘటన’పై డీఎల్పీవో, ఎంపీవో విచారణ
-గున్గల్ సెక్రటరీకి చౌదర్పల్లి అదనపు బాధ్యతలు
యాచారం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శి జ్యోత్స్న, కారోబార్ లింగంలను తక్షణమే తొలగించాలని లిఖిత పూర్వకంగా చౌదర్పలి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇంటి రిజిస్ర్టేషన్ (ఆస్తి విలువ తెలిపే) పత్రం ఇవ్వకపోవడంతో గురువారం ముక్కెర మధుసూదన్ అనే వ్యక్తి పురుగులు మందు తాగిన వైనంపై శుక్రవారం డీఎల్పీవో సాధన, ఎంపీవో శ్రీలత గ్రామస్తుల సమక్షంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా వారు పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో పాటు పంచాయతీ కార్యదర్శితో విడివిడిగా మాట్లాడి వివరాలు తీసుకున్నారు.
డబ్బులు తీసుకొని కూడా పని చేయలేదు
కార్యదర్శి జ్యోత్స్న నిర్లక్షంతో తమ బిడ్డ పురుగుల మందు తాగారని అతడికి ఏం జరిగినా ఆమె బాధ్యత వహించాలని బాధితుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఏ పని చేయాలన్నా ఆమె డబ్బులు డిమాండ్ చేశారని గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన వద్ద రూ.3,500 తీసుకుందని అయినా పని చేయకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటుందని గోదాసు రాములు అనే వ్యక్తి అధికారులకువివరించారు. కాగా, అతని వద్ద కేవలం రూ.2,100 మాత్రమే తీసుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి అధికారులకు వివరించారు. ఇలా చాలా మంది గ్రామస్తులు ఆమెపై పలు ఆరోపణలు చేశారు.
కలెక్టర్కు నివేదిస్తాం
విచారణ అనంతరం డీఎల్పీవో సాధన విలేకరులతో మాట్లాడుతూ గ్రామస్తులు డబ్బులు ఎవరికి ఇవ్వరాదని, డబ్బులు తీసుకుంటే తక్షణమే అందుకు తగిన రశీదు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయ రికార్డులు కూడా తనిఖీ చేశాను. విచారణ నివేదికను కలెక్టర్కు నివేదిస్తానని తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారని వెల్లడించారు. కాగా, గున్గల్ పంచాయతీ కార్యదర్శి శోభారాణికి చౌదర్పల్లి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఎంపీడీవో నరేందర్రెడ్డి తెలిపారు. విచారణ అనంతరం డీఎల్పీవో సాధన, ఎంపీవో శ్రీలత బాధితుడు మఽధుసూదన్ ఇంటి కొలతలు తీసుకున్నారు. విచారణ సమయంలో యాచారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.