Share News

కనులపండువగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

ABN , Publish Date - May 23 , 2024 | 11:48 PM

మండలంలోని వెంకటాపూర్‌లోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి కల్యాణం గురువారం కనుల పండువగా నిర్వహించారు.

కనులపండువగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
వెంకటాపూర్‌లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి కల్యాణంలో భాగంగా మాంగళ్యాన్ని చూపుతున్న అర్చకుడు

  • అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 23: మండలంలోని వెంకటాపూర్‌లోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి కల్యాణం గురువారం కనుల పండువగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, నిత్యహోమం, బలిహరణ కార్యక్రమాలు జరిపించారు. అనంతరం ఆలయ ఆవరణలోని కల్యాణ మండపాన్ని పచ్చనితోరణాలతో సుందరంగా అలంకరించి అమ్మవార్లను, స్వామివారిని ప్రతిష్ఠించారు. ఆలయ చైర్మన్‌ ఉదారి వేణుగోపాల్‌ స్వామివారికి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణం గురించి భక్తులకు వివరించారు. అమ్మవార్లకు, స్వామివారికి జిలకర్రబెల్లం సమర్పించారు. వేదపండితులు భక్తులకు మాంగళ్యధారణ చూపించి కల్యాణం చేయించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు, స్వామివారికి ఓడిబియ్యం సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు కందుల నవీన్‌, శంకర్‌, లింగం, రామకృష్ణరెడ్డి, గుర్రం కళావతి, కట్ట శేఖర్‌, ఆలయ ఈవో లగడపాటి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం జరిపించారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రే్‌షయాద్‌, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ నీరుడి రామారావు, డీసీసీ అధ్యక్షుడు హరివర్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు నీరుడి గీతాశ్రీనివాస్‌ బాల్‌రాజ్‌, బుర్ర వెంకటే్‌షగౌడ్‌, బీజేపీ మండల అధ్యక్షుడు చలువాది ప్రవీణ్‌రావు, కర్రె రాజేష్‌, వినోద్‌, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:49 PM