Share News

పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:50 PM

పశువులకు గాలి కుంటు వ్యాధి సోకకుండా మార్చి నెలాఖరు వరకు టీకాలు వేస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు.

పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అనిల్‌కుమార్‌

వికారాబాద్‌, ఫిబ్రవరి 29 : పశువులకు గాలి కుంటు వ్యాధి సోకకుండా మార్చి నెలాఖరు వరకు టీకాలు వేస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని మార్చి 1 నుంచి 30 వరకు చేపడుతామని చెప్పారు. వ్యాధి ప్రబలకుండా ఈ టీకాలిచ్చేందుకు జిల్లాలో నెల రోజుల పాటు కార్యాచరణ తయారుచేశామన్నారు. మండలానికి 2 నుంచి 3 పశువైద్య సిబ్బంది బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 3 నెలల వయసు పైబడిన పశువులన్నింటికీ ఉచితంగా టీకాలు ఇస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులకు, పశుపోషకులకు సమాచారం ఇచ్చి చాటింపు చేయించి గ్రామాలకు ఉదయాన్నే వెళ్లి పశువులకు టీకాలు వేస్తామన్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైందని, ఈ వ్యాధి సోకిన పశువుల నోటిలో, కాళ్లలో పుండ్లు ఏర్పడి మేత మేయక, నడవలేక నీరసిస్తాయన్నారు. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పడిపోతుందన్నారు. వ్యాధి సోకిన పశువులకు చికిత్స చేయకుంటే మరణిస్తాయన్నారు. పశువుకు టీకాలు వేసి చెవి పోగు వేసి పశువులు, వాటి యజమాని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామన్నారు. పశుపోషకులు పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేయించి వ్యాధులు సోకకుండా కాపాడుకోవాలని వైద్యాధికారి కోరారు.

Updated Date - Feb 29 , 2024 | 11:50 PM