వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:26 AM
వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. పోచారం, తాండూరు పరిధిలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఘట్కేసర్ రూరల్, జూన్ 16: వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. పోచారం, తాండూరు పరిధిలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. పోచారం పోలీస్స్టేషన్ పరిధిలో సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మున్సిపాలిటీ, బొక్కొనిగూడకు చెందిన మహ్మద్ బాబా జాన్(45), పోచారం మున్సిపల్, జోడిమెట్ల సమీపంలోని ఓ ప్రైవేటు కెమికల్ కంపెనీలో ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా శనివారం రాత్రి 11గంటలకు పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ ఎన్టీపీసీ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మహ్మద్ బాబా జాన్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
తాండూరు రూరల్: బైకును ఢీ కొన్న ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన తాండూరు మండలం అంతారం గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం కందనెల్లి తండాకు చెందిన శ్రీనివాస్ బైక్పై తాండూరుకు వచ్చి తిరిగితండాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో తాండూరు మండలంలోని అంతారం గ్రామశివారు వరకు రాగానే బైపాస్ రింగ్రోడ్డు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తల నుజ్జునుజ్జయి దుర్మరణం చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులతో చర్చించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.