వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
ABN , Publish Date - Jan 03 , 2024 | 12:51 AM
మేడ్చల్ జిల్లా పరిధిలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. వారిలో ఓ మూడేళ్ల చిన్నారి ఉంది.
![వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మూడుచింతలపల్లి, జనవరి 2 : మేడ్చల్ జిల్లా పరిధిలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. వారిలో ఓ మూడేళ్ల చిన్నారి ఉంది. ఈ ఘటనల వివరాలిలా ఉన్నాయి. తుర్కపల్లిలోని జీనోమ్ వ్యాలీ పరిధిలో కొల్తూర్కు చెందిన సంజీవ(37) శామీర్పేట్లోని ఎంపీఎన్ఎల్ ఎంటర్ప్రైజర్ అనే కాంట్రాక్టు సంస్థలో పనిచేసేవాడు. సోమవారం విధులు ముగించుకుని తన బైక్పై ఇంటికి వస్తుండగా కొల్తూర్లోని వివేకానుందుని విగ్రహం వద్ద ఎదురుగా వచ్చిన కారు(ఏపీ32 ఎ755) ఢీకొట్టింది. దీంతో సంజీవ అక్కడిక్కకడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వాహనం ఢీకొని యాచకుడు మృతి
ఘట్కేసర్ రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యాచకుడు మంగళవారం మృతిచెందిన సంఘటన పోచారం పరిధిలో చోటుచేసుకుంది. ఐటీసీ పోలీసుస్టేషన్ ఎస్ఐ శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్-వరంగల్ రహదారి అన్నోజిగూడలోని ఎన్టీపీసీ చౌరస్తా వద్ద ఓ యాచకుడు(40) రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. యాచకుడికి గాయాలు కాగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యాచకుడు మంగళవారం రాత్రి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వాటర్ ట్యాంకర్ ఢీకొని చిన్నారి ...
మేడ్చల్ టౌన్: వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ చిన్నారి అక్కడిక్కడే మృతిచెందిన ఘటన మంగళవారం మేడ్చల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మేడ్చల్ చెక్పోస్టు చెరువుకట్ట సమీపంలో నివాసం ఉంటున్న లక్ష్మన్ కూతురు అధ్యాయ(3) ఇంటి ముందు ఆడుకుంటోంది. చెక్పోస్టు సమీపంలో ఓ బోరుబావి వద్ద వాటర్ను నింపుకుని ఓ కంపెనీకి సరఫరా చేసేందుకు వెళ్తూ ట్రాక్టర్ బాలికను ఢీకొట్టింది. దీంతో అధ్యాయ తలకు గాయాలై అక్కడిక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.