Share News

వీడిన హత్య కేసు మిస్టరీ

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:00 PM

కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి శివారులోని పెద్ద చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మిద్దె యాదయ్యది పోలీసులు హత్యగా తేల్చారు.

వీడిన హత్య కేసు మిస్టరీ

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పథకం

కొండారెడ్డిపల్లిలో ఘటన.. నిందితుల అరెస్టు

కేశంపేట, జనవరి 18 : కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి శివారులోని పెద్ద చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మిద్దె యాదయ్యది పోలీసులు హత్యగా తేల్చారు. విచారణ ప్రారంభించిన కేశంపేట పోలీసులు ఐదు రోజుల్లో కేసును ఛేదించారు. యాదయ్య భార్య పథకం వేస్తే.. ఆమె ప్రియుడు హత్య చేశాడు. కేసు వివరాలను షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ రామిరెడ్డి గురువారం వెల్లడించారు. కొండారెడ్డిపల్లికి చెందిన మిద్దె యాదయ్య(38) వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాళ్లలో బోరుబండిపై కూలీగా పనిచేస్తున్నాడు. తనకు వచ్చే జీతాన్ని ఇంటికి పంపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, తాను సంకాంత్రికి ఈ నెల 8న ఇంటికి వస్తున్నట్లు భార్య శివలీల అలియాస్‌ స్వాతికి సమాచారమిచ్చాడు. అయితే, ఈ విషయానిన శివలీల తన ప్రియుడు, కోనాయపల్లికి చెందిన బర్క ఆంజనేయులుతో చెప్పింది. తన భర్త ను ఎలాగైనా చంపేయాలని ప్రియుడిని కోరింది. దాంతో ఆంజనేయులు షాద్‌నగర్‌లో యాదయ్యను బైక్‌పై ఎక్కించుకొని మార్గమధ్యంలో వైన్స్‌ వద్ద మద్యం కొన్నాడు. అనంతరం కొండారెడ్డిపల్లి శివారు పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ మద్యం సేవిస్తూ గొడవపడ్డారు. దీంతో యాదయ్యను ఆంజనేయులు బండరాయితో తలపై బలంగా మోది హత్య చేశాడు. సీడీఆర్‌ డేటాతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. కాగా, వారి వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని యాదయ్యను హతమార్చినట్లు సీఐ తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. మృతుడి తల్లి మిద్దె అమృతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీఐ వివరించారు. హత్య కేసును 5 రోజుల్లో ఛేదించిన కేశంపేట ఎస్‌ఐ వరప్రసాద్‌, క్రైం కానిస్టేబుల్‌ శివకుమార్‌, రవి, అశోక్‌రెడ్డిలను సీఐ రామిరెడ్డి, షాద్‌నగర్‌ ఏసీపీ రంగస్వామి అభినందించారు.

Updated Date - Jan 18 , 2024 | 11:00 PM