అక్రమ డబ్బాల తొలగింపునకు రంగం సిద్ధం
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:32 PM
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ చౌరస్తా వద్ద రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా ఏర్పాటు చేసుకున్న డబ్బాలను తొలగించడానికి మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేశారు.
మేడ్చల్ టౌన్, ఆగస్టు 24: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ చౌరస్తా వద్ద రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా ఏర్పాటు చేసుకున్న డబ్బాలను తొలగించడానికి మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేశారు. జాతీయ రహదారి నుంచి కండ్లకోయ గ్రామం వైపు వస్తున్న రోడ్డుకు ఇరువైపులా కొందరు అక్రమంగా డబ్బాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఫలితంగా రోడ్డు ఇరుకుగామారి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పలువురు స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు డబ్బాల తొలగింపునకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యాపారుల వద్ద కొందరు స్థానిక రాజకీయ నాయకులు నెల సరి మామూళ్లు వసూలు చేసి పబ్బంగడుపుకుంటున్నాని, విద్యుత్ కనెక్షన్లు ఇప్పించి రోడ్డు కబ్జాకు పెట్టి పోషిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇప్పటికే మున్సిపల్ తరపున వ్యాపారస్తులకు నోటీసులు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవటంతో ఇక బలవంతంగా డబ్బాలను తొలగించడానికి సిబ్బంది సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. డబ్బాలు ఏర్పాటు చేసుకోవటంతో పాటు పలు అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు గుర్తించారు. అక్రమ నిర్మాణాలు, డబ్బాలను తొలగించే వేళ ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా బందోబస్తుగా స్థానిక పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. రెండు మూడు రోజుల్లో డబ్బాలను స్వతహాగా తొలగించుకోకపోతే మున్సిపల్ సిబ్బంది నేరుగా తొలగించే పనులను ప్రారంభిస్తుందని ఇధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.