లారీని ఢీకొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Feb 12 , 2024 | 11:42 PM
ముందు వెళ్తున్న లారీని ఢీకొని బైక్పై ఉన్న వ్యక్తి గాయాలపాలయ్యాడు. ఈ ఘటన తాండూరు మండలం కోటబాస్పల్లిలో సోమవారం చోటుచేసుకుంది.
![లారీని ఢీకొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/12_TANDUR_RURAL_102_6ba7fa83d3.jpg)
తాండూరు రూరల్, ఫిబ్రవరి 12: ముందు వెళ్తున్న లారీని ఢీకొని బైక్పై ఉన్న వ్యక్తి గాయాలపాలయ్యాడు. ఈ ఘటన తాండూరు మండలం కోటబాస్పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. కరన్కోట్ ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని చించోళి తాలూక చౌడాపూర్కు చెందిన బస్వరాజ్ బైక్పై తాండూరు వస్తున్నాడు. అదే సమయంలో కోటబాస్పల్లి శివారులోకి రాగానే ముందుగా వెళ్తున్న లారీని బైక్ ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న బస్వరాజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అంబులెన్స్లో తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుడు బస్వరాజ్ బైక్లో కల్లు, కర్ణాటకకు చెందిన గుట్కాలు ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. నిర్లక్ష్యంగా లారీ నడిపిన డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని మరో వ్యక్తికి..
పరిగి: బైక్పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని హనుమన్ గండి వద్ద చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని మందులకాలనీకి చెందిన బుడగజంగం రాములు బైక్పై పరిగికి వస్తుండగా పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొని టైర్లకింద పడింది. దీంతో రాములు కాళ్లు విరిగి నుజ్జునుజ్జయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతన్ని పరిగిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలించారు. రాములు భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.