విరాసత్ కోసం ఆరు నెలలుగా నిరీక్షణ
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:08 AM
రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి ఓ రైతు అలిసిపోయాడు. ఆరు నెలల క్రితం విరాసత్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ పెండింగ్లో ఉంది. దాంతో ఆ రైతు ప్రతీరోజు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని బిజ్వార్ గ్రామానికి చెందిన పెంటగుంతల చంద్రప్పకు తన తండ్రి పెంటప్ప పేరున ఉన్న 6ఎకరాల 4గుంటల భూమి ఉంది. పెంటప్పకు ముగ్గురు కుమారులు. ఇందులో ఇద్దరు మృతిచెందారు. అయితే, కుమారులు చనిపోవడంతో ఒక కుమారుడు, ఇద్దరు కోడళ్ల పేరుమీద భూమి వారసత్వంగా పట్టా చేయాల్సి ఉంది.
![విరాసత్ కోసం ఆరు నెలలుగా నిరీక్షణ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రైతు
రెండుసార్లు మీ-సేవలో విరాసత్కు దరఖాస్తు
రెవెన్యూ అధికారులపై అవినీతి ఆరోపణలు!
కలెక్టర్ దృష్టి సారించాలని కోరుతున్న ప్రజలు
తాండూరు రూరల్, ఏప్రిల్ 13: రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి ఓ రైతు అలిసిపోయాడు. ఆరు నెలల క్రితం విరాసత్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ పెండింగ్లో ఉంది. దాంతో ఆ రైతు ప్రతీరోజు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని బిజ్వార్ గ్రామానికి చెందిన పెంటగుంతల చంద్రప్పకు తన తండ్రి పెంటప్ప పేరున ఉన్న 6ఎకరాల 4గుంటల భూమి ఉంది. పెంటప్పకు ముగ్గురు కుమారులు. ఇందులో ఇద్దరు మృతిచెందారు. అయితే, కుమారులు చనిపోవడంతో ఒక కుమారుడు, ఇద్దరు కోడళ్ల పేరుమీద భూమి వారసత్వంగా పట్టా చేయాల్సి ఉంది. ఇందుకోసం చంద్రప్ప 2023 అక్టోబర్ 13న రూ.16వేలు మీ-సేవలో చెల్లించి విరాసత్కు తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దాంతో మళ్లీ అక్టోబర్ 23న మరో రూ.16వేలు చెల్లించినా ఫలితం లేకపోయిందని రైతు చంద్రప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. అన్నిరకాల సర్టిఫికెట్లు ఉండి ఆరునెలల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా విరాసత్ కావడం లేదని వాపోతున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని రైతు వేడుకుంటున్నాడు.
అధికారులపై అవినీతి అక్రమాల ఆరోపణలు
తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని కార్యాలయాలకు వెళ్లే ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ధరణిలో అధికారులు అవినీతి ఆరోపణల మూలంగానే వారిని బాధ్యతల నుంచి తప్పించి రిజిస్ట్రేషన్ అఽథారిటీని తహసీల్దార్ తారాసింగ్కు అప్పగించినట్లు తెలిసింది. ధరణి ఆపరేటర్ను సైత ం మార్చినట్లు సమాచారం. రెవెన్యూ జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపితే తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బండారం బయటపడుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కలెక్టర్ రెవెన్యూ అధికారులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.
విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్నది వాస్తవమే
బిజ్వార్కు చెందిన రైతు చంద్రప్ప విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం వాస్తవమే. క్షేత్రస్థాయిలో వెళ్లి పంచనామా పూర్తి చేశాం. లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి నివేదికను పంపిస్తాం. ప్రతీ రైతుకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాం. చంద్రప్ప సమస్య తెలుసుకొని అతడికి అన్నివిధాలా న్యాయం చేస్తాం.
- బాల్రాజ్, తాండూరు ఆర్ఐ