రాముడి అక్షింతలతో శోభాయాత్ర
ABN , Publish Date - Jan 05 , 2024 | 12:00 AM
అయోద్య శ్రీరాముడి పూజిత అక్షింతల కలశాల శోభాయాత్ర గురువారం కీసరలో వైభవంగా జరిగింది. గ్రామానికి చేరుకున్న అక్షింతల కలశాలకు గ్రామ దేవత బంగారు మైసమ్మ ఆలయం వద్ద గ్రామ పెద్దలు, ప్రముఖులు, భక్తులు మంగళహారులతో, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు.
![రాముడి అక్షింతలతో శోభాయాత్ర](https://media.andhrajyothy.com/media/2023/20231205/4ksr12_a1b4e92d84.jpg)
కీసర, జనవరి 4: అయోద్య శ్రీరాముడి పూజిత అక్షింతల కలశాల శోభాయాత్ర గురువారం కీసరలో వైభవంగా జరిగింది. గ్రామానికి చేరుకున్న అక్షింతల కలశాలకు గ్రామ దేవత బంగారు మైసమ్మ ఆలయం వద్ద గ్రామ పెద్దలు, ప్రముఖులు, భక్తులు మంగళహారులతో, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం కలశాల అక్షింతలను శోభాయాత్రగా గ్రామంలో రథంపై ఊరేగించి సీతారామచంద్ర స్వామి ఆలయానికి చేర్చారు. శోభాయాత్రలో భాగంగా గ్రామస్థులు, రామభక్తులు కాషాయం జెండాలతో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఆలయానికి చేరుకున్న అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేస్తామని గ్రామపెద్దలు తెలిపారు.
మోమిన్పేట్: మండలంలోని టేకులపల్లి గ్రామంలో ఇంటింటికి శ్రీరాముల అక్షింతలను వితరణ చేసినట్లు హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు నీలి నగేశ్ తెలిపారు. గ్రామంలోని హనుమాన్ మందిరంలో ఉంచిన అయోధ్య రాముని అక్షింతలను గురువారం ఇంటింటికి తిరిగి ప్రజలకు అందజేశారు. అక్షింతలతో పాటు జనవరి 22న జరిగే అయోధ్య శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రతీ ఇంటికి అక్షింతలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆ రోజు ప్రతీ ఇంట్లో ఐదు దీపాల చొప్పున వెలిగించాలని సూచించారు. ఈకార్యక్రమంలో హిందూ సంఘా ల సభ్యులు పూజారి దిలీప్కుమార్, నారాయణరెడ్డి, శివారెడ్డి, మాధవరెడ్డి, బ్రహ్మంచారి, బిక్షపతి, జీవన్కుమార్, మల్లేశం, సాయిరెడ్డి, లడ్డు, ఆంజనేయులు పాల్గొన్నారు.
కులకచర్ల: మండల కేంద్రంలో అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన అక్షింతల శోభా యాత్ర గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం నుంచి అయ్యప్పస్వామి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. జైశ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రహ్లాద్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, పార్టీ జిల్లా నాయకులు శ్రీధర్రెడ్డి, సర్పంచ్ సౌమ్యరెడ్డి, స్థానికులు అంజిలయ్య, చంద్రలింగం, కృష్ణయ్యగౌడ్ పాల్గొన్నారు.