వేర్వేరు చోట్ల మద్యం పట్టివేత
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:45 PM
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఘట్కేసర్ రూరల్, జూలై 28: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ సైదులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఘట్కేసర్ మున్సిపాలిటీ, చందుపట్లగూడకు చెందిన పంజాల సందీప్(30) ఎదులాబాద్ అనుబంధ గ్రామం కొత్తగూడెంకు చెందిన బాలబోయిన శ్రీశైలంయాదవ్(40)లు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడిచేశారు. వీరివద్ద నుంచి కింగ్ఫిషర్ బీర్లు 20, గుడ్డే విస్కీ 34 స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పోచారంలో..
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ లక్ష్మినర్సింహా కాలనీలో బెల్ట్షాప్ నిర్వహిస్తున్న ఓ ఇంటిపై దాడి చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజువర్మ తెలిపారు. నానావత్ వినోద అలియాస్ లక్ష్మి బెల్ట్షాప్ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడిచేసి అఫీసర్స్ చాయిస్ 180ఎంఎల్ మూడు, డౌన్-టౌన్ బాటిళ్లు 26, అఫీసర్స్ చాయిస్ 90 ఎంఎల్ 30బాటిళ్లు, ఐబీ ఒక బాటిల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వినోదను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.