మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి
ABN , Publish Date - Mar 15 , 2024 | 12:09 AM
మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉప్పల్కు చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని ఖరారు చేశారు. ఈ విషయాన్ని గురువారం సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
శంభీపూర్ రాజును మార్చిన కేసీఆర్
చక్రం తిప్పిన హరీశ్రావు
కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా పావులు
మేడ్చల్, మార్చి 14(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉప్పల్కు చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని ఖరారు చేశారు. ఈ విషయాన్ని గురువారం సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసేందుకు మొదట మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఆసక్తి చూపినా తదనంతర పరిణామాలతో తమ కుటుంబం నుంచి ఎవరూ లోక్సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని మల్లారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా బుధవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పోటీలో ఉంటాడని ప్రకటించినప్పటికీ తిరిగి లక్ష్మారెడ్డి పోటీలో ఉంటారని కేసీఆర్ ప్రకటించడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల వరకు ఊపులో ఉన్నా.. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన లక్ష్మారెడ్డి టికెట్ రాక చివరి నిమిషంలో బీఆర్ఎ్సలో చేరారు. మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నా ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
ఎమ్మెల్యే హరీశ్రావు జోక్యంతోనే!
కాగా మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎంపికలో చివరి నిమిషంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చక్రం తిప్పినట్లు తెలిసింది. మొదట కేటీఆర్ శంభీపూర్ రాజును పోటీ చేయాలని ఆదేశించినా సామాజిక గణాంకాల ఆధారంగా అభ్యర్థిని మార్చినట్లు తెలుస్తోంది. మాల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను ప్రకటించింది. ఆయన ప్రచారాన్ని సైతం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థే పోటీలో ఉంటారని సమాచారం. బీఆర్ఎస్ నుంచి బీసీ అభ్యర్థిని పోటీలో నిలిపితే కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూరుతుందనే ఉద్దేశ్యంతోనే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మార్చి ఉప్పల్కు చెందిన ఓసీ వర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేసినట్టు తెలిసింది. తాము గెలువకున్నా ఫర్వాలేదు గానీ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గెలవకుండా ఉండేందుకే బీఆర్ఎస్ తన అభ్యర్థిని మార్చినట్టు తెలుస్తోంది. ఈటల కూడా ఒకప్పటి పాత మిత్రుడే కనుక ఇలాగైనా సంతృప్తి చెందొచ్చనే ఆలోచనలోనూ బీఆర్ఎస్ శ్రేణులున్నాయని మల్కాజిగిరి నియోజకవర్గంలో రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.