జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:53 PM
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ సీహెచ్ బుగ్గరాములు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంకోసం గ్రామ పంచాయతీ కార్మికులు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో చేపట్టిన టోకెన్ సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్ సీహెచ్ బుగ్గరాములు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంకోసం గ్రామ పంచాయతీ కార్మికులు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో చేపట్టిన టోకెన్ సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. అర్హులైన కారోబార్, బిల్ కలెక్టర్లకు సహాయ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.
తలకొండపల్లి : పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు హాజరయ్యారు. పాండు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది, కార్మికులకు నెలల కాలంగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించామన్నారు. మల్టీపర్పస్ విధానంలో పనిచేస్తున్న దాదాపు వంద మంది కార్మికులు చనిపోయారని, వారి కుటుంబాలు వీధినపడ్డాయని అన్నారు. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయు ఏరియా కన్వీనర్ పెంటయ్య, యూనియన్ మండల అధ్యక్షుడు బుర్ర జంగయ్య, బేగరి యాదమ్మ, రాములు,పాండు, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు : జీపీ కార్మికుల సమస్యలను పరిస్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నాయకులు నిరసన ర్యాలీని నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి బుట్టి బాల్రాజ్ మాట్లాడుతూ 40ఏళ్లుగా గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని ఆరోపించారు. అనంతరం మండల కేంద్రంలో మన్మోహన్సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల సంఘం నాయకులు అనేగౌని బాల్రాజ్గౌడ్, యాదయ్య, నర్సింహ, హరికృష్ణ, శ్రీధర్రెడ్డి, అనిల్, అంజయ్య, యాదయ్య, గణేష్, యశోధ, జయ్యమ్మ, కళమ్మ, పార్వత మ్మ తదితరులు పాల్గొన్నారు.