కీలక మలుపులు
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:01 AM
ఈ ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎ్సకూ చేదు అనుభవాలే మిగిలాయి.
రాజకీయం.. రసవత్తరం
ఉత్కంఠగా జరిగిన ఎంపీ ఎన్నికలు
జంపింగ్లతో పార్టీల ఉక్కిరిబిక్కిరి
కాంగ్రెస్, బీఆర్ఎస్కు కలిసిరాని కాలం
రెండు సీట్లతో వికసించిన కమలం
పార్టీలు మారిన నేతలకు తప్పని భంగపాటు
అధికార పార్టీలో ‘నామినేటెడ్’ భర్తీలు
సంచలనంగా మారిన లగచర్ల ఘటన
స్థానిక ఎన్నికలకు ఎదురుచూస్తున్న నాయకులు
ఉమ్మడి జిల్లా పొలిటికల్ రౌండప్ -2024
ఈ ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎ్సకూ చేదు అనుభవాలే మిగిలాయి. పార్టీలు మారిన నేతలకు భంగపాటే మిగిలింది. గతేడాది అధికారం పోగొట్టుకున్న బీఆర్ఎ్సకు ఈ సంవత్సరం సైతం కలిసి రాలేదు. వరుస జంపింగ్లతో ఉక్కిరిబిక్కిరైంది. రసవత్తరంగా జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటూ దక్కలేదు. కమలం పార్టీ మాత్రం వికసించింది. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. అలాగే ఈ ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అనుకున్నప్పటికీ.. రిజర్వేషన్ల కారణంగా బ్రేక్ పడింది. ఈ ఎన్నికల కోసం ద్వితీయ శ్రేణి నాయకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది కాలంలో జరిగిన ఉమ్మడి జిల్లా రాజకీయాలపై రౌండప్.
రంగారెడ్డి అర్బన్, డిసెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా రాష్ట్ర రాజకీయాలకు కేరా్ఫగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, శాసనసభ స్పీకర్ వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిఽథ్యం వహిస్తుండటంతో ఇక్కడి నుంచే కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికార కాంగ్రె్సతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎ్సకు ఈ ఏడాది పెద్దగా కలిసిరాలేదు. గతేడాది అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఒకొక్కరుగా అధికార పార్టీలోకి చేరుకోవడంతో ఆ పార్టీ బలహీన పడింది. ఈ ఏడాది ఎంపీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధినేతలు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్షా, కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధి రోడ్డు షో ల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలు దక్కించుకున్న బీఆర్ఎస్ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. అలాగే అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీకి సైతం ఒక్క సీటూ దక్కలేదు. కానీ.. కమలం వికసిచింది. చేవెళ్ల, మల్కాజిగిరి, పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సంపన్నులు బరిలో దిగారు. ఎంపీ టికెట్ కోసం కాంగ్రె్సలో చేరిన వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్కు మల్కాజిగిరి టికెట్ దక్కింది. బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరి చేవెళ్ల ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. మల్కాజిగిరి లోక్సభ స్థానంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన రాగిడి లక్ష్మారెడ్డి, చేవెళ్ల నుంచి పోటీ చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ఓటమి చెందారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ కాంగ్రెస్ మల్కాజిగిరి సిట్టింగ్ స్థానాన్ని తిరిగి గెలవలేకపోయింది. ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజవర్గంలో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగరలేదు. చేవెళ్ల, మల్కాజిగిరి నుంచి గడ్డం రంజిత్రెడ్డి, సునితా మహేందర్రెడ్డి ఓటమి పాలయ్యారు. చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి, మల్కాజిరిగి నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు.
వరించిన నామినేటెడ్ పదవులు..
కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన నేతలకు అధిష్ఠానం ప్రాధాన్యత కల్పించింది. ఎన్నికలకు ముందు టికెట్ ఆశించి బంగపడిన నేతల్లో కొందరికి ఇప్పటికే నామినేటెడ్ పదవులను కట్టబెట్టింది. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎల్బీనగర్ సీనియర్ నేత మల్రెడ్డి రాంరెడ్డి, బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు కార్పొరేషన్ పదవులు దక్కాయి. పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్గా చల్లా నర్సింహారెడ్డికి దక్కింది. రాష్ట్ర రోడ్లు అభివృద్ధి సంస్థ చైర్మన్గా మల్రెడ్డి రాంరెడ్డి, ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా జ్ఞానేశ్వర్ను నియమిచింది. సీఎం రేవంత్రెడ్డి అనుచరుడిగా పేరొందిన షాబాద్ మండలానికి చెందిన ఎలుగంటి మధుసూదన్రెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి చిలక మధుసూదన్రెడ్డిని వరించింది. అలాగే రాష్ట్ర పొల్యూషన్ బోర్డు మెంబర్గా చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లికి చెందిన చింపుల సత్యనారాయణరెడ్డికి దక్కింది. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్కు ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్గా అవకాశం దక్కింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గాని పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్గా గురునాథ్రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రాజేశ్వర్రెడ్డికి దక్కింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా కల్వ సుజాతకు దక్కింది. రమేశ్ మహారాజ్కు స్టేట్ కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు.
లగచర్లలో అధికారులపై దాడి.. కేసులు నమోదు
వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. వికారాబాద్ జిల్లా హకీంపేట, పోలేపల్లి, లగచర్ల గ్రామాల పరిధిలో 1,358.37 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను ఫార్మ విలేజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కావాల్సిన భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫార్మా వద్దంటూ పోలేపల్లి, లగచర్ల గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలంలో ఫార్మా కారిడార్ ఏర్పాటు కోసం నిర్వహించ తలపెట్టిన భూ సేకరణ కోసం ఈ ఏడాది నవంబరు 11న అధికారులు లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం రణరంగంగా మారింది. ఆయా గ్రామాల రైతులు సమావేశాన్ని బహిష్కరించి నిరనస వ్యక్తం చేశారు. విషయం తెలిసిన అధికారులు రైతులతో మాట్లాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలో భూ సేకరణను వ్యతిరేకిస్తున్న అక్కడి ప్రజలు అధికారులపై దాడికి యత్నించారు. కలెక్టర్తో పాటు అక్కడికి వచ్చిన అధికారులపై దాడికి పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రమేయం ఉందని పట్నం నరేందర్రెడ్డిని ఏ-1గా అరెస్టు చేశారు. ఈ కుట్రకు కారకుడైన సురేష్ పారిపోగా అతన్ని పట్టుకుని రిమాండ్కు తరలించారు. కొన్ని రోజుల తర్వాత నరేందర్రెడ్డితో పాటు కొంత మంది రైతులకు నాంపల్లి ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
ద్వితీయశ్రేణి నాయకుల ఎదురుచూపు
పంచాయతీల పాలకవర్గం ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ముగిసింది. జిల్లా పరిషత్ల పాలక వర్గాల పదవీ కాలం జూలై 3వ తేదీతో ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ ఏడాది నవంబరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అనుకున్నప్పటికీ.. రిజర్వేషన్ల కారణంగా బ్రేక్ పడింది. బీసీ కుల గణన తర్వాతనే స్థానిక నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే కుటుంబ సర్వే పూర్తి చేశారు. ఇక త్వరలో ఎన్నికల నగరా మోగనుంది. ఎన్నికల కోసం ద్వితీయ శ్రేణి నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
వరుస జంపింగ్లతో ఉక్కిరిబిక్కిరి
ఈ ఏడాది బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగలాయి. వరుస జంపింగ్లతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరైంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో అత్యంత ఆసక్తికరమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతూ ఆకర్ష్కు మరింత పదును పెట్టింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ నేతలను, ఎమ్మెల్యేలు, ఎంపీలను కాంగ్రె్సలోకి ఆహ్వానించడంతో వరుసకట్టారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రె్సలో చేరారు. జెడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్రెడ్డితో పాటు ఆమె మామ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం హస్తం గూటికి చేరుకున్నారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రె్సలో చేరినప్పటికీ.. ఇంకా శివారు ఎమ్మెల్యేలు బీఆర్ఎ్సలోనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాపై ఇంకా కాంగ్రెస్ పట్టు సాధించలేక పోతుంది.