వరకట్న వేధింపులకు నవవధువు బలి
ABN , Publish Date - Apr 17 , 2024 | 11:57 PM
అదనపు కట్నం తేవాలని భర్త, అత్తింటివారి బంధువులు వేధించడంతో విసిగిపోయిన ఓ నవవధువు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
పరిగి, ఏప్రిల్ 17: అదనపు కట్నం తేవాలని భర్త, అత్తింటివారి బంధువులు వేధించడంతో విసిగిపోయిన ఓ నవవధువు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని నస్కల్కు చెందిన గౌస్, జైనాబేగం దంపతుల కుమార్తె షహీనాబేగం(24)ను, పూడూరు మండలం గొంగుపల్లికి చెందిన ఎండీ యూసుఫ్, సఖినబీ దంపతుల కుమారుడు రఫీతో ఈ యేడాది ఫిబ్రవరి 5న వివాహం జరిపించారు. కట్నకానుకలుగా 8 తులాల బంగారం, వెండి, నగదు, సామగ్రితో కలిపి మొత్తం రూ.16 లక్షలు వరకు ఇచ్చారు. వారి దాంపత్య జీవితం రెండు నెలలు గడవకముందే వేధింపులు మొదలయ్యాయి. షహీనాబేగం పెళ్లైన తర్వాత రెండుసార్లు తల్లిగారి ఇంటికి వచ్చి వెళ్ళింది. ఈక్రమంలో అదనంగా ఇస్తామన్న రూ.2లక్షల కట్నం తీసుకురమ్మని భర్త రఫీతో పాటు అత్తామామలు, వారి బంధువులు మహబూబీ, తదితరులు వేధించారు. తనను ఎందుకు వేధిస్తున్నారని షహీనా కుటుంబ సభ్యులు, బంధువులు వారిని నిలదీశారు. పంచాయితీ పెట్టి మాట్లాడదామని ఒప్పుకున్నారు. అయితే, ఈనెల 12న రఫీ, షహీనాబేగంను నస్కల్లో వదిలివెళ్లారు. సోమవారం రాత్రి ఇంటి పైకి(దాబా) వెళ్ళి చదువుకుటానని చెప్పిన షహీనా ఫ్యాక్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి జైనాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ తెలిపారు.