కొడంగల్కు మెడికల్ కళాశాల
ABN , Publish Date - Feb 02 , 2024 | 12:20 AM
ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ(కడా) ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. విద్యా సంస్థల ఏర్పాటుపై దృష్టి సారించింది.
![కొడంగల్కు మెడికల్ కళాశాల](https://media.andhrajyothy.com/media/2023/20231205/1_KDL_3_e34be63070.jpg)
నర్సింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ కాలేజీలు కూడా!
వికారాబాద్, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/కొడంగల్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ(కడా) ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. విద్యా సంస్థల ఏర్పాటుపై దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ కాలేజీల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ఈ కాలేజీలన్నీ ఒకే ప్రాంగణం(క్యాంప్స)లో ఏర్పాటు చేసేలా స్థలాన్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్స(టిమ్స్) డైరెక్టర్ డాక్టర్ విమలాథామస్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శివరాం, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి గురువారం కొడంగల్ సమీప ఉడుమేశ్వరం, అప్పాయిపల్లి, బొంరా్సపేట్, నాగిరెడ్డిపల్లి ప్రాం తాల్లో పరిశీలించారు. కొడంగల్-తాండూరు మార్గంలో అప్పాయిపల్లి వద్ద 70 ఎకరాలు, బొంరా్సపేట్ మండలం, నాగిరెడ్డిపల్లి వద్ద 39ఎకరాల ప్రభుత్వ భూములు, బొంరా్సపేట్ వద్ద 231 ఎకరాల అటవీ భూమిని పరిశీలించారు. ఉడుమేశ్వరం వద్ద నిర్మిస్తున్న బీసీ బాలుర గురుకుల భవనాన్ని సందర్శించారు. కొడంగల్లోని 50పడకల సామాజిక ఆసుపత్రిని 100 పడకలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ కాలేజీకి దీన్ని బోధనాసుపత్రిగా ఆధునికీకరిస్తారు. కొడంగల్ నుంచి అప్పారెడ్డిపల్లి 4.5 కిలోమీటర్లు, నాగిరెడ్డిపల్లి 9 కిలోమీటర్లు, బొంరా్సపేట్ 14 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. ఆస్పత్రికి దగ్గరలోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తారు.ఇందుకు ఉడుమేశ్వరం బీసీ గురుకుల భవనాన్నే వాడుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
సీఎం నిర్ణయం మేరకే స్థలం ఎంపిక
కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్, అనుబంధ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదిత నాలుగు స్థలాల్లో సీఎం రేవంత్రెడ్డి నిర్ణ యం మేరకే ఎక్కడనేది నిర్ణయిస్తారు. స్థలాలవిస్తీర్ణం వివరాలు, మ్యాప్లతో సీఎంకు అధికారులు నివేదిక అందజేస్తారు.
వైద్య కళాశాల ఏర్పాటుకు స్థలసేకరణ వివరాలివ్వాలి
కొడంగల్/బొంరాస్పేట్, ఫిబ్రవరి 1 : కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య, విద్య, నర్సింగ్, ఫార్మాసిటీ, ఫిజియోథెరపీ కాలేజీల ఏర్పాటుకు స్థల సేకరణ వివరాలు అందజేయాలని అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొడంగల్ మండలం ఉడిమేశ్వరం సమీపంలో నిర్మిస్తున్న బీసీ గురుకుల పాఠశాల, అప్పాయిపల్లి, బొంరాస్పేట్, నాగిరెడ్డిపల్లి ప్రాంతాల భూములను కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ విమలథామస్, వైద్య విద్య డైరెక్టర్ శివరాంలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూములకు సంబంధించిన వివరాలు, విస్తీర్ణం, మ్యాప్లు అందజేయాలని సూచించారు. కొడంగల్లో గల 50 కమ్యూనిటీ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా విస్తరించేందుకు స్థలాన్ని కిమ్స్ డైరెక్టర్ విమల పరిశీలించారు. ప్రస్తుత ఆస్పత్రి స్థల వివరాలు, అదనంగా నిర్మాణం చేపట్టేందుకు వీలుగా ఖాళీ స్థల వివరాలు, మ్యాప్ను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ బి.విజయ్కుమార్, డీసీహెచ్ఎస్ ప్రదీప్, ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రప్రియ, డాక్టర్లు వీణ, సాకేత్, బీసీ గురుకులం రీజినల్ కో-ఆర్డినేటర్ యాదయ్యగౌడ్, ప్రిన్సిపాల్ శంకర్ పాల్గొన్నారు.