Share News

మంగళపల్లి-చెన్నారం రోడ్డుకు బీటీ ఎప్పుడో?

ABN , Publish Date - May 25 , 2024 | 11:27 PM

రెండు మండలాలను కలిపే మంగళపల్లి-చెన్నారం రోడ్డుకు బీటీ ఏర్పాటు, వాగుపై వంతెన నిర్మాణం కలగానే మిగిలింది.

మంగళపల్లి-చెన్నారం రోడ్డుకు బీటీ ఎప్పుడో?
రాళ్లతో కూడిన మంగళపల్లి-చెన్నారం రోడ్డు

వాగుపై బ్రిడ్జి లేక రాకపోకలకు గ్రామాల ప్రజల ఇబ్బందులు

ఏళ్లుగా అమలుకు నోచుకోని నేతల హామీలు

ఆమనగల్లు, మే 25 : రెండు మండలాలను కలిపే మంగళపల్లి-చెన్నారం రోడ్డుకు బీటీ ఏర్పాటు, వాగుపై వంతెన నిర్మాణం కలగానే మిగిలింది. ఏళ్లుగా ఇది ప్రతిపాదనల్లోనే నిలిచింది. ఈ రోడ్డును బీటీగా మార్చి, వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు దశాబ్దాలుగా కోరుతున్నారు. రోడ్డు సరిగ్గా లేక రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళపల్లి నుంచి చెన్నారం 5 కిలోమీటర్ల ఈ రోడ్డును బీటీగా మారిస్తే ఆమనగల్లు, షాద్‌నగర్‌ వెళ్లడానికి గ్రామాల ఇబ్బందులు తీరుతాయి. పలు మార్లు బీటీ, వాగుపై వంతెన నిర్మాణం గురించి మండల పరిషత్‌ నుంచి కూడా ప్రతిపాదనలు పంపారు.నేటికీ స్పందన లేదు. నాలుగేళ్ల కిత్రం ఆమనగల్లు-షాద్‌నగర్‌ రోడ్డు నుంచి మంగళపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మించారు. కానీ మంగళపల్లి-చెన్నారం రోడ్డు కు బీటీ వేయలేదు. మంగళపల్లి సమీపంలోని ఈ రోడ్డులో వాగుపై వంతెన లేని కారణంగా వర్షాకాలంలో వాగు సాగి రాకపోకలు నిలిచిపోతున్నాయి.మంగళపల్లికి చెందిన చాలా మంది రైతుల పొలాలు వాగు అవతలి వైపు ఉన్నాయి. వర్షమొస్తే రైతులు పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. పంచాయ తీ డంప్‌ యార్డ్‌, వైకుంఠధామాలు కూడ ఈ రోడ్డును పక్కనే నిర్మించారు. ఎన్నికలప్పుడు వంతెన, బీటీ రోడ్డు గురించి నాయకులు హామీ ఇస్తున్నా అమలు చేయడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే జైపాల్‌ రూ.50లక్షలు మంజూరైనట్లు ప్రకటించినా టెండర్లు జరుగలేదు. ఇప్పటికైనా రోడ్డు, బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - May 25 , 2024 | 11:27 PM