ఆటో-జీపు ఢీకొని వ్యక్తి దుర్మరణం
ABN , Publish Date - Mar 28 , 2024 | 11:54 PM
ఎదురెదురుగా వస్తున్న ఆటో, జీపు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
నలుగురికి గాయాలు
యాలాల, మార్చి 28: ఎదురెదురుగా వస్తున్న ఆటో, జీపు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం సాయంత్రం యాలాల పోలీ్సస్టేషన్ పరిధి అగ్గనూర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. యాలాల ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరారెడ్డిపల్లికి చెందిన మల్లప్ప(40), తాండూరుకు చెందిన శివకుమార్, చంద్రకళ, వెంకటప్ప, విమల తాండూరు నుంచి బషీరాబాద్ మండలం దామర్చెడ్ గ్రామంలోని ఓ వివాహానికి హాజరయ్యారు. అక్కడ వివాహం ముగించుకొని సాయంత్రం ఆటోలో తిరిగి వస్తుండగా తాండూరు నుంచి బషీరాబాద్ వైపు వెళ్తున్న జీప్ అగ్గనూర్ గ్రామ సమీపంలో ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మల్లప్ప తీవ్ర గాయాలపాలై తాండూరులో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శివకుమార్, చంద్రకళ, వెంకటప్ప, విమలలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు.