Share News

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:19 AM

లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని సయ్యద్‌పల్లికి చెందిన పి.సత్తయ్య(36) వృత్తిరీత్యా డ్రైవర్‌. శుక్రవారం పని నిమిత్తం సయ్యద్‌పల్లి నుంచి చిట్యాల్‌ వైపు బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

పరిగి, మార్చి 8 : లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని సయ్యద్‌పల్లికి చెందిన పి.సత్తయ్య(36) వృత్తిరీత్యా డ్రైవర్‌. శుక్రవారం పని నిమిత్తం సయ్యద్‌పల్లి నుంచి చిట్యాల్‌ వైపు బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దాంతో సత్తయ్య తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి అంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ మరొకరు మృతి

బైక్‌పై నుంచి కిందపడటంతో వ్యక్తికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతిచెందాడు. వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని ఎన్నెపల్లికి చెందిన ఎండీ యూసుఫ్‌(53) గురువారం పని నిమిత్తం పరిగి మండలం సయ్యద్‌పల్లికి వెళుతున్నాడు. రాఘవాపూర్‌ శివారులో బైక్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. దాంతో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు అజ్మద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు.

కులకచర్లలో గుర్తుతెలియని వృద్ధురాలు..

కులకచర్ల, మార్చి 8: గుర్తుతెలియని వృద్ధురాలు మృతిచెందిన ఘటన కులకచర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. కులకచర్ల ప్రభుత్వాసుపత్రి సమీపంలో 20 రోజులుగా గుర్తుతెలియని వృద్ధురాలు(80) ఓ చెట్టు కింద గూడు వేసుకొని ఉంటోంది. కాగా, ఆమెకు సమీపంలోని ఇళ్లవారు భోజనం పెట్టేవారు. శుక్రవారం సాయంత్రం అటుగా వెళ్లేవారు ఆమెను గమనించగా చలనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.దాంతో వారు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అయితే, ఆమె ఎవరు? బంధువులు ఉన్నారా? అనే విషయాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మృతదేహాన్ని పంచాయతీ సిబ్బంది ఖననం చేశారు.

Updated Date - Mar 09 , 2024 | 12:19 AM