డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వినూత్న తీర్పు
ABN , Publish Date - May 17 , 2024 | 12:39 AM
మద్యం సేవించి పట్టుబడిన కేసులో న్యాయాధికారి వినూత్న రీతిలో తీర్పునిచ్చారు. జరిమానా కింద విధించే డబ్బులతో పండ్లు కొనుగోలు చేసి ఆస్పత్రిలో రోగులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.
తాండూరు/తాండూరు రూరల్, మే 16: మద్యం సేవించి పట్టుబడిన కేసులో న్యాయాధికారి వినూత్న రీతిలో తీర్పునిచ్చారు. జరిమానా కింద విధించే డబ్బులతో పండ్లు కొనుగోలు చేసి ఆస్పత్రిలో రోగులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. దీంతో నిందితులు పండ్లు పంపిణీ చేశారు. తాండూరు సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో తాండూరు పట్టణం సాయిపూర్కు చెందిన పి.ఉదయ్, అభిజీత్, పరిగి మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన గుల్ల నగేష్, బషీరాబాద్ మండలం బహదూర్ పూర్కు చెందిన రాజులు పట్టుబడ్డారు. వీరిని గురువారం తాండూరు న్యాయస్థానంలో హాజరు పర్చగా తాండూరు మున్సిఫ్ కోర్టు స్పెషల్ జ్యూడిషియల్ న్యాయాధికారి నామల అశోక్ తీర్పును వెలువరుస్తూ నిందితులు రూ.1000ల జరిమానా విధించారు. ఆ డబ్బుతో పండ్లు కొనుగోలు చేసి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రోగులకు పంపిణీ చేయాలని ఆదేశించినట్లు సీఐ వివరించారు. నిందితులు పండ్లు కొనుగోలు చేసి జిల్లా ఆస్పత్రిలోని 30మంది రోగులకు పండ్లు పంపిణీ చేశారని తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడుపరాదని, నడిపితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.