అక్రమంగా మట్టి తవ్వకాలు.. జేసీబీ, రెండు టిప్పర్లు సీజ్
ABN , Publish Date - Apr 10 , 2024 | 12:53 AM
మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రీ పగలు తేడాలేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపడుతన్నారు.
షాద్నగర్ రూరల్/మాడ్గుల, ఏప్రిల్ 9 : మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రీ పగలు తేడాలేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపడుతన్నారు. ఫరూఖ్నగర్ మండలం వెలిజర్ల శివారులోని వెంకటాపురం చెరువులో సోమవారం రాత్రి రెండు జేసీబీలు, మూడు టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న వెలిజర్ల గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకుని అడ్డుకున్నారు. కాగా, ఆ సమయంలో మట్టి తరలింపునకు వత్తాసు పలుకుతున్న కేశంపేట మండలానికి చెందిన కొందరు నాయకులు వెలిజర్ల గ్రామస్తులపై దాడికి ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడికి కేశంపేట పోలీసులు చేరుకున్నారు. అయినా, మట్టి తవ్వకాలు కొనసాగుతుండటంతో వెలిజర్ల గ్రామానికి చెందిన దొడ్డి రవీందర్ డయల్ 100కు ఫోన్ చేశాడు. షాద్నగర్ పోలీసులు ఒక జేసీబీ, రెండు టిప్పర్లను సీజ్ చేశారు. అదే రాత్రి దొడ్డి రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మాడ్గుల మండలం అందుగుల వాగునుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు.